పెద్దపల్లి రూరల్, మార్చి 24(ఆంధ్రప్రభ) : ఈనెల 21న కురిసిన అకాల రాళ్ళ వర్షం, వడగండ్ల వానతో పెద్దపల్లి జిల్లాలో 8మండలాల్లో రైతులు పంట నష్టపోయారని, వారికి తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని, అందుకు నిధులు విడుదల చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైదారాబాద్ లో అసెంబ్లీ హాల్లో సీఎం ఛాంబర్ లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే విజయ రమణారావు కలిసి పంటనష్టం, రైతులకు పరిహారం చెల్లింపుపై వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 2 మండలాల్లోని 11 గ్రామాల్లో 1035 మంది రైతులకు చెందిన వరిపంట దెబ్బతిందని, 6 మండలాల్లోని 28 గ్రామాల్లో 828 మంది రైతులకు చెందిన 1084 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు వర్షం వల్ల నష్టం వాటిల్లిందని సీఎంకు తెలిపారు.
అలాగే ఒక మండలంలోని గ్రామంలో 30మంది రైతులకు సంబంధించి 20ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులతో పంటనష్టం సర్వే చేయించి ప్రాథమిక అంచనాకు రూపొందించామని పేర్కొన్నారు. తాను స్వయంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని పంటపొలాలు, మొక్కజొన్న చేన్లు, కూరగాయల తోటలను పరిశీలించి పంటనష్టంపై అధికారులతో సమీక్షించానని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో 1896 మంది రైతులకు చెందిన 2627 ఎకరాల్లో పంటలు నష్టపోయారని తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. ఇందుకు గాను దెబ్బతిన్న పంటలకు రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. అవసరమైన మేరకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి రైతులను ఆదుకుంటామని అభయమిచ్చారని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. నష్టపరిహారం తక్షణమే అందేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు తొందరలోనే పరిహారం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు.