జగిత్యాల, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల సంస్థ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శ్యాం ప్రసాద్ లాల్ ఆదేశించారు. గురువారం జగిత్యాల జిల్లాలోని అల్లిపూర్ లో రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించారు. ప్రతినిత్యం విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ… విద్యా ప్రమాణాలను పెంపొందించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు రావాలన్నారు. నాణ్యమైన భోజనం అందించాలని, నాసిరకం సరుకులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, నాణ్యమైన విద్యను అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు.