ADB | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ ప్రతినిధి, మే 30 (ఆంధ్రప్రభ) :జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, మందుల విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న అరుణ్ ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈసందర్భంగా దుకాణంలోని విత్తనాలు, పురుగు మందుల ప్యాకింగ్, లేబుళ్లు, అమ్మకాల రిజిస్టర్లు, నిల్వల వివరాలు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిషేధించిన మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని, నిబంధనల్ని అతిక్రమించిన వారి మీద చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అధికారులు రెగ్యులర్‌గా దుకాణాలపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నకిలీ విత్తనాల సరఫరా, అమ్మకాలపై కఠినంగా చర్యలు తీసుకుని రైతుల ప్రయోజనాలను కాపాడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తనిఖీలో వ్యవసాయ అధికారి రాజశేఖర్, తహసీల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *