AP | పశ్చిమలో గాలివాన బీభత్సం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు

  • జలమైన జలమయమైన రహదారులు..
  • నిలిచిన విద్యుత్ సరఫరా..
  • తడిసిన రబీ ధాన్యం..
  • మామిడికి అపార నష్టం


భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం గాలివాన బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలై నిలిచి అనంతరం ఉదయం 10గంటల సమయంలో గాలివాన ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలవాలాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాలివానతో పాటు భారీ వర్షం నమోదు కావడంతో ఎక్కడికక్కడ రహదారులు జలమయమ‌య్యాయి. భీమవరం, తాడేపల్లిగూడెం రహదారి జలమయం కావడంతో వాహ‌ణ‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమవరంలోని బ్యాంకు కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆర్టీసీ డిపో తదితర ప్రాంతాల్లో వర్షపునీరు భారీగా నిలిచిపోవడంతో వాహణ‌దాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమేశ్వర స్వామి ఆలయం సమీపంలోని సోమగండం చెరువు వద్ద ఉన్న భారీ వృక్షం ఈదురు కాలులకు చెరువులో కూలింది. భీమవరంలోని పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు, కొమ్మలు కారణంగా కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమ‌య్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, ఉండి, ఆచంట, తనుకు, తాడేపల్లిగూడెం, తదితర నియోజకవర్గాల్లో ఈ గాలివాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

రబీ రైతులకు తీవ్ర నష్టం..
ఉన్నట్టుండి ఒక్కసారిగా విరుచుకుపడిన గాలివాన బీభత్సంతో రబీ రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఎక్కడికక్కడ కళ్లాల్లో ధాన్యం రాశుల్లో ఉన్న ధాన్యం ఈ గాలివానకు తడిసి ముద్దయ్యింది. మార్కెట్ కు తరలించేందుకు లారీలపై, ట్రాక్టర్లపై లోడింగ్ లో ఉన్న ధాన్యం కూడా తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోతకు వచ్చిన వరి చేలలో అడుగుమేర వర్షపు నీరు నిలిచిపోవడంతో వరి కోతలు వాయిదా పడనున్నాయి. కొన్నిచోట్ల వరిచేలు నేలమట్టం కావడంతో వరి కోతలు ఆలస్యం కానున్నాయి. పంటను గట్టుకు చేర్చేందుకు ఖర్చులు రెట్టింపు కానున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మామిడికి అపార నష్టం..
కోతకు వచ్చిన మామిడి తోటలు ఒక్కసారిగా వచ్చిన గాలివానతో కాయలన్నీ నేలపాలయ్యాయి. దాదాపుగా 70శాతంకు పైగా కాయలు రాలి పడిపోవడంతో మామిడి రైతులకు అపార నష్టం ఏర్పడనుంది. ఇప్పటికే పెరిగిన తోటల లీజు ధరలతో పాటు దిగుబడులు కూడా ఈ సంవత్సరం ఆశాజనకంగా లేకపోవడంతో ఏదోలాగా పెట్టిన పెట్టుబడి దక్కించుకునేందుకు రైతులు పడుతున్న శ్రమపై ఈ అకాల వర్షం నీళ్లు చల్లింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మామిడి తోటలకు ఈ గాలివాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తోటల్లో ఎక్కడ చూసినా రాలిన కాయలతో దర్శనమిస్తున్నాయి.

Leave a Reply