SRH vs DC మ్యాచ్ వర్షార్పణం..

ఐపీఎల్ 2025 లో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ లాగ ప్రవేశించిన వరుణ.. హైదరాబాద్ ఇన్నింగ్స్ కు ఆటంకం కలిగించాడు. దాంతో 134 పరుగుల లక్ష్య ఛేదనతో బ‌రిలోకి దిగాల్సిన స‌న్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఒక్క బంతి కూడా ఆడకుండానే ముగిసింది. దీంతో రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది.

వర్షం ఆగిపోతే మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించడానికి అంపైర్లు, గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఒక దశలో వర్షం ఆగిపోయినట్లు అనిపించింది. ఓవర్లకు కోత ప‌డినా.. మ్యాచ్ ఇంకా కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ మైదానంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో, మైదానం మొత్తం చిత్త‌డిగా మారింది. దాంతో మ్యాచ్ నిర్వహించడం అసాధ్యం అయింది. ఈ క్ర‌మంలో కటాఫ్ సమయానికి ముందే అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తూ ప్రకటించారు. రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది.

అయితే, మ్యాచ్ రద్దుతో సన్ రైజర్స్ ప్లేఆఫ్ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన‌ట్టైంది. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల త‌రువాత‌ ఈ సీజ‌న్ ప్లేఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించిన మూడవ జట్టుగా నిలిచింది ఆరెంజ్ ఆర్మీ. మ‌రోవైపు ఢిల్లీ 13 పాయింట్ల‌తో 5వ స్థానంలో కొన‌సాగుతొంది.

హడలెత్తించిన పేసర్లు..

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లి క్యాపిటల్స్‌కు సన్‌రైజర్స్‌ పేసర్లు హడలెత్తించారు. నిప్పులు చెరిగే బంతులతో వారిపై విరుచుకుపడ్డారు. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల‌కు చుక్క‌లు చూపించారు. కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (1/13), హ‌ర్ష‌ల్ ప‌టేల్ (1/36), ఈషాన్ మ‌లింగ (1/28) అద‌ర‌గొట్టారు.

కాగా, ఢిల్లీ జ‌ట్టు 62 పరుగుల‌కే 6 వికెట్లు ప‌డిన వేళ ట్రిస్టన్ స్టబ్స్ (41 నాటౌట్), అశుతోష్ శర్మ (41) అద్భుతంగా ఆడారు. ఏడో వికెట్‌కు 66 పరుగులు జోడించి… ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ బోర్డుపై 133 పరుగుల న‌మోదు చేశారు.

కమిన్స్‌ అరుదైన ఘనత..

సోమవారం ఢిల్లితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ సారథి పాట్‌ కమిన్స్‌ తన నలుగు ఓవర్లో కోటాలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ మూడు వికెట్లను కూడా పవర్‌ ప్లేలోనే పడగొట్టడం విశేషం. ఈ క్రమంలోనే కమిన్స్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో పవర్‌ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా కమిన్స్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు అక్షర్‌ పటేల్‌ (ఢిల్లి), షాన్‌ పోలాక్‌ (ముంబై), జహీర్‌ ఖాన్‌ (ఢిల్లి) సారథులు పవర్‌ ప్లేలలో రెండేసి వికెట్లు పడగొట్టారు. తాజాగా కమిన్స్‌ వీరందరిని అధిగమించాడు.

Leave a Reply