అమ్రాబాద్, ఆంధ్రప్రభ : ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను బుధవారం ఉదయం ప్రమాద ప్రదేశానికి తీసుకెళ్లారు. రోబో ద్వారా టన్నెల్ లోపల ఉన్న శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం, వంటి సహాయక చర్యలు చేపట్టనున్నారు. మనుషుల కన్నా 15 రెట్లు అత్యధిక సామర్థ్యంతో రోబో పనిచేయడం ప్రత్యేకత అని, ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగంగా పూర్తి చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థంగా ముందుకు తీసుకెళ్లడానికి రోబోలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
టన్నెల్ లోపల ఉన్న శిథిలాలు, మట్టి కుప్పలు, తేమ, ఆక్సిజన్ సమస్యలు వంటి అడ్డంకులను దృష్టిలో పెట్టుకొని రోబోలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ద్వారా 40 హెచ్పీ పంపు సహాయంతో బురదను బయటికి పంపనున్నారు. ఈ రోబో గంటకు ఐదు వేలు క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, రోబోను పరిశీలించిన అనంతరం, అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో విజయ్, అక్షయ్ తమ బృందంతో కలసి లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ లోపల ప్రమాద ప్రదేశానికి వెళ్లారు. ప్రస్తుతం సహాయక చర్యల్లో 12 కేంద్ర, రాష్ట్ర సంస్థలకు చెందిన బృందాలు 24 గంటలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మానవ సహాయక బృందాలకు అవసరమైన సామాగ్రి, నీరు, మెడికల్ సపోర్ట్, ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
19వ రోజుకు చేరిన సహాయక చర్యలు

ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఏడుగురు ఆచూకీ కోసం బుధవారం నుంచి రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంగళవారం కమ్యూనికేషన్ రోబోను పంపించి పరిస్థితి అంచనా వేశారు. ఉదయం రోబోను లోపలకు పంపించారు. రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. చికుక్కున ఏడుగురు ఆచూకీ కోసం విస్తృత చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఉన్న ప్రమాదకర ప్రాంతాలను తవ్వేందుకు రోబోలను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.