వెలగపూడి: మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ స్పీడ్ పెంచింది. కీలక సూత్రధారులు, పాత్రదారులుగా భావిస్తున్న వారిని వరుసగా విచారించేందుకు సిద్ధమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కమీషన్లు సమర్పించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా సిట్ విచారణకు పిలుస్తోంది. వీరిని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో కలిపి ప్రశ్నించి కీలక వివరాలను రాబట్టాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మద్యం కుంభకోణం దర్యాప్తు నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఆయన విచారణకు హాజరవుతారా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ.. విచారణకు సహకరించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.