NZB | పాకిస్థాన్ పౌరులను వెంటనే పంపించేయండి.. సీపీకి ఎమ్మెల్యేల వినతి

నిజామాబాద్ ప్రతినిధి, మే 5 (ఆంధ్రప్రభ ) : నిజామాబాద్ జిల్లాలో పాకిస్థాన్ పౌరసత్వం ఉన్న వ్యక్తులను వెంటనే పంపించేయాలని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు జిల్లా పోలీస్ కమీషనర్ సాయి చైతన్యను కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసి మాట్లాడారు.

నిజామాబాద్ జిల్లాలో పాకిస్తాన్ పౌరసత్వం, చెల్లుబాటు కాని వీసాలతో నివసించే వారిని గుర్తించి వెంటనే పంపించేయాలని కోరారు. గతంలో నిజామాబాద్ లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పట్టుపడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తూ అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేసి వారిని గుర్తించాలని ఎమ్మెల్యేలు సీపీని కోరారు. నగర అంతర్గత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేయడం లేదన్నారు. ఇందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లే అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ దేశ పౌరులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply