సూర్యఘర్తో సేవ్ ఎనర్జీ.. సేవ్ మనీ..

సూర్యఘర్తో సేవ్ ఎనర్జీ.. సేవ్ మనీ..
పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ..
విజయవాడ, ఆంధ్రప్రభ : ఇంధనాన్ని వృధా చేస్తే డబ్బును వృధా చేసినట్లేనని.. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరిగి సేవ్ ఎనర్జీ – సేవ్ మనీ నినాదాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ ఇంధన పొదుపును పాటించాలని, అదేవిధంగా పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. బుధవారం జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు.
పీఎం సూర్యఘర్ ద్వారా రాయితీతో ఏర్పాటుచేసుకున్న సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థ ద్వారా వినియోగించుకోగా అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్కు ప్రభుత్వం నుంచి తిరిగి డబ్బు పొందేందుకు వీలుందన్నారు. ఇంధన పొదుపును ప్రతిఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని.. సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకర పర్యావరణాన్ని భావితరాలకు బహుమతిగా అందించడం ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.

