కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఆచివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీపాలు వెలిగించి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటున్నారు.
కాగా సోమవారం రాత్రి 7:45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రి 6 గంటల నుంచి వేద స్వస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 7.46 నుంచి 7.54 వరకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. పుష్కరాలకు చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో హజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు
ఆదివారం నాడు.
కాగా, ఆదివారం నాడు 3.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ సోమవారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాళేశ్వరం వెళ్లే రూట్లో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు దాదాపు 15కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి తోడు ప్రైవేటు వాహనాలను ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు, పుష్కర ఘాట్ల వరకు అనుమతించడం సమస్య తీవ్రతను మరింత పెంచింది. చాలామంది భక్తులు మహారాష్ట్ర వైపు పుణ్యస్నానాలు చేసి శివుడిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు.