TG | రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు..
తెలంగాణలో రైతు భరోసా పథకం కింద లక్షలాది మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ప్రధానంగా ఒక ఎకరం వరకు సాగు భూమి ఉన్న రైతులకు ఈ సాయం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు.
రైతు భరోసా పథకం ప్రారంభం నుండి ఇప్పటివరకు మొత్తం రూ.1,126.54 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వివరించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోందని, నిర్ణీత గడువులోగా నిధులు విడుదల చేస్తున్నామని, రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
కాగా, ఇప్పటికే చాలామంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాగా… ఎకరం భూమి ఉన్నా రైతుభరోసా పడలేదని కొందరు వాపోతున్నారు. రేపు లేదా ఎల్లుంది వారి అకౌంట్లోనూ భరోసా డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.