నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో పగవరపల్లి దోమలపెంట మధ్యలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు. వీరంతా కారులో మహారాష్ట్ర నుంచి బయల్దేరి శ్రీశైలం వెళుతున్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతం దోమల పెంట గ్రామానికి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఇవాళ మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదం పై ఈగలపెంట ఎస్సై వీరమల్లు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కొందరు శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఇన్నోవా కారులో వెళ్తున్నారు. సరిగ్గా దోమలపెంట గ్రామ సమీపంలోకి రాగానే శ్రీశైలం వైపు నుంచి హైదరాబాద్ వెళుతున్న పీకేట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇన్నోవా కారులో ఉన్న ఇద్దరికీ బలమైన గాయాలు అయ్యాయన్నారు. వెంటనే ఆ ఇద్దరు క్షతగాత్రులను ఒక ప్రైవేటు అంబులెన్స్ తో పాటు ఈగలపెంట ఎస్సై పోలీసు వాహనంలో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం పంపించారు.
క్షతగాత్రుల్లో ఒకరు డాక్టర్ సుధాకర్ పటేల్ ఐపీఎస్ మహారాష్ట్ర, రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారని, ఈయనకు తలపై బలమైన గాయాలు అయినట్లు సమాచారం. మరొక వ్యక్తి భగవత్ కృష్ణారావు రెండు కాళ్లకు బలమైన గాయాలయ్యాయని సమాచారం. అచ్చంపేట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ప్రధాన రహదారి వెల్దండ సమీపంలో ఉన్న ఎన్నం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.