హైదరాబాద్ : బిఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ …అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018,2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు మదన్ లాల్.
2009లో రాజకీయాల్లోకిబానోతు మదన్ లాల్ 1963 మే 03లో ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం, ఈర్లపుడి గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు. బానోతు మదన్ లాల్ 2009లో వైరా శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి బానోత్ చంద్రావతి చేతిలో 47 వేల 539 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
కేటీఆర్ సంతాపం
ఖమ్మం జిల్లా వైరా మాజీ శాసనసభ్యులు మదన్ లాల్ అకాల మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా నాయకుడిగా, ఎమ్మెల్యే గా వైరా నియోజకవర్గ ప్రజలకు విశేష సేవలందించిన మదన్ లాల్ మరణం పార్టీకి, గిరిజన, బడుగు, బలహీన వర్గ ప్రజలకు తీరని లోటు అని కేటీఆర్ అన్నారు.
మదన్ లాల్ చేసిన కృషి మరువలేనిదని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. నిబద్ధత నిజాయితీగల నాయకుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మదన్ లాల్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మదన్ లాల్ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.