Review Meeting | గడువులోగా స్కూళ్లు రెడీ కావాలి – అధికారులతో రేవంత్
స్థల సేకరణలో వేగం పెంచాలి అనువైన భూమిని ఎంపికచేయాలి
లేకుంటే ప్రత్యామ్నాయం చూడాల్సిందే
యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూళ్లపై ఫోకస్ పెట్టాలి
వీరనారి అయిలమ్మ వర్సిటీలో అన్ని సదుపాయాలు కల్పించాలి
విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
టూరిజం డెవలప్మెంట్పై అధికారులతో సమీక్ష
పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. తక్షణమే అనువైన స్థల సేకరణ చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంద నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సరైన ప్రత్యామ్నాయాలు చూడాలి..
ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సీఎం సూచించారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలన్నారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలని చెప్పారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వందశాతం పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.
అయిలమ్మ మహిళా వర్సిటీలో మౌలిక వసతులు..
వీరనారి చాకలి అయిలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని సీఎం రేవంత్ సూచించారు. ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముగిసిన స్పష్టం చేశారు. అనంతరం పర్యాటక శాఖపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.