హైదరాబాద్ – మిస్ వరల్డ్ 2025 పోటీలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న పోటీలు నెల రోజులు సాగనున్నాయన్నారు..ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.
కాగా, హైదరాబాద్ లో ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో నేడు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ, మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను స్పష్టం చేశారు. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని, నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.