Review | భద్రాద్రి పవర్ ప్లాంటు పనులు వేగవంతం చేయండి – డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ – భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మల్లు జెన్కో అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రజాభవన్లో భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం అభివృద్ధి పురోగతి పనులపై జెన్కో అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షించారు.
ఈ సమావేశానికి ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా హాజరయ్యారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బిహెచ్ఎల్ కంపెనీ వారు అగ్రిమెంట్ ప్రకారం చేయాల్సిన ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి నిర్దిష్ట గడువు నిర్దేశించి దానికి అనుగుణంగా పనులు చేయించాలని అధికారులకు సూచించారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్ యూనిట్-1 ఉత్పత్తికి సంబంధించి కాలిపోయిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తుల గురించి ఆరా తీశారు. మరమత్తు పనులు చేయడానికి టెండర్ పిలిచామని, పనులు పురోగతిలో ఉన్నాయని చీఫ్ ఇంజనీర్ పి.వి శ్రీనివాస్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతమైనప్పుడు విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఉండడానికి స్పేర్ గా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మరొక్కొటి కొనుగోలు చేస్తున్నామని, దీనికి కూడా టెండర్ పిలిచినట్లు చెప్పారు.
ఎలక్ట్రికల్, మెకానికల్ కు సంబంధించిన అదనపు పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
జెన్కో పరిధిలోని విద్యుత్తు కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో ఏదైనా సంఘటన జరిగి ఉత్పత్తి నిలిచిపోతే వీలైనంత తొందరగా పునరుద్ధరణ చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవడానికి డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్ అధికారులతో త్రి సభ్య కమిటీ వేయాలని ఆదేశించారు. విద్యుత్తు ఉత్పత్తిలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి తీసుకోవలసిన అన్ని చర్యల గురించి త్రీ మెన్ కమిటీ నిర్దిష్ట గడువులోగా సమీక్షించి తగిన నివేదికను బోర్డుకు సమర్పించాలని, ఆ తర్వాత బోర్డు నుంచి అనుమతి తీసుకొని విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి చేసి సంస్థకు నష్టం రాకుండా దోహదపడాలన్నారు. సరైన నిర్ణయం సకాలంలో తీసుకునే విషయంలో ఆలస్యం కాకుండాత్రి సభ్య కమిటీ ఉపయోగపడుతుందని వివరించారు.
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి బి.హెచ్.ఈ.ఎల్ వారు చేయాల్సిన పెండింగ్ పనులు, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంటు పనితీరు, వర్షాకాలంలో బొగ్గు నిల్వ చేయడానికి కావలసిన షెడ్డు నిర్మాణ పనులు, సింగరేణి మైనింగ్ నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకు బొగ్గు రవాణా చేయడానికి ఏర్పాటు చేస్తున్న రైల్వే లైన్ పనులు, సిబ్బంది వసతి గృహ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పవర్ ప్లాంట్ కు సంబంధించి బిహెచ్ఇఎల్ వారు చేయాల్సిన పెండింగ్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ పనుల్లో తప్పనిసరిగా వారు నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. వర్షాకాలం సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తడి బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల సంస్థకు నష్టం వస్తుందని అధికారులు పేర్కొనడంతో బొగ్గు నిల్వ చేయడానికి కావలసిన షెడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
సింగరేణి మైనింగ్ ప్లాంట్ మణుగూరు నుంచి భద్రాద్రి, థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్ వరకు కొనసాగుతున్న రైల్వే లైన్ నిర్మాణ పనుల పురోగతి గురించి ఆరా తీశారు. 18.67 కిలోమీటర్ల పొడవునా రైల్వే లైన్ నిర్మాణ పనులకు 201.30 ఎకరాలు భూసేకరణ జరుగుతుందన్నారు. రైల్వే లైన్ పనుల్లో వేగం పెంచడానికి ప్రతి వారం సమీక్ష జరపడంతో పాటు క్యాలెండర్ ఫిక్స్ చేసి పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు మరియు సిబ్బంది వసతి గృహ నిర్మాణ పనుల వేగం పెంచాడానికి క్యాలెండర్ ఫిక్స్ చేసి టార్గెట్ విధించాలని సూచించారు.
భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రంలో ఏ చిన్న సంఘటన జరిగిన పవర్ ప్లాంటు ఛీప్ ఇంజనీర్ పూర్తి బాధ్యత వహించాలని, వెంటనే ఆ విషయాన్ని తనతో పాటు సీఎండి దృష్టికి తీసుకురావాలన్నరు. ఈ విషయంలో ఆలసత్వం వహిస్తే చర్యలుంటాయన్నారు. పవర్ ప్లాంటులో పని చేయడానికి కావాల్సిన నాన్ టెక్నికల్ కార్మికులను ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ద్వారా స్థానిక గిరిజనులను నియామకం చేసుకోవాలని సూచించారు. విద్యుత్తు ఉత్పత్తికి వాడుతున్న బొగ్గు ద్వారా వస్తున్న బూడిదను వినియోగంలోకి తీసుకురావాడానికి ఆలోచన చేస్తున్నట్టు వివరించారు.
స్థానికి ట్రైబల్ యువతను స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించడానికి బూడిదతో ఇటుకలు తయారు చేయించే యూనిట్స్ ఏర్పా్టుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్ఫున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపత్యంలో బూడిదతో ఇటుకలు తయారు చేసుకునే యువతకు మంచి లాభం చేకూరుతుందన్నారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి సంబంధించి త్రి-డి వాక్ వే మోడల్ తయారు చేయించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జెన్కో డైరెక్టర్లు ఆజయ్, సచ్చిదానంధం, లక్ష్మయ్య, ఛీఫ్ ఇంజనీర్లు శ్రీనివాస్ రావు, రత్నాకర్ రావు, పి.వి శ్రీనివాస్, జేవాకూమార్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.