ఓదెల ఆంధ్రప్రభ – గాలి వాన భీభత్సానికి విద్యుత్ తీగలు తెగిపడి గొర్రెలు, మేకలు మృత్యువాత పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో చోటుచేసుకుంది. మడక గ్రామానికి చెందిన వేల్పుల చిన్న కొమురయ్యకు చెందిన 25 గొర్రెలు, మేకలు పాకలో ఉండగా, కరెంటు తీగలు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. బుధవారం తెల్లవారుజామున ఒకేసారి గాలులతో వర్షం రావడంతో త్రీఫేస్ కరెంటు వైర్ తెగిపోయింది.
దీంతో మేకలు , గొర్రెలకు చుట్టూ ఇనుప కంచె ఉండటంతో వైరు పడడంతో వాటికి విద్యుత్ షాక్ తగిలి మరణించాయి.. ఈ ప్రమాదంతో సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిలినట్టు బాధితుడు వాపోయాడు. స్థానిక నాయకులు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి గ్రామానికి పంపించారు. ఓదెల పశువైద్యాధికారి డాక్టర్ మల్లేశం తన బృందంతో ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సంఘటన పై ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కు నివేదికలు అందిస్తామన్నారు.