ప్రభుత్వ పట్టు వస్త్రాలు సమర్పణ

ప్రభుత్వ పట్టు వస్త్రాలు సమర్పణ

  • రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
  • దుర్గమ్మను కోరాను : సీఎం చంద్రబాబు..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలానక్షత్రం సందర్భంగా సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను సీఎం దంపతులు దర్శించుకున్నారు. చంద్రబాబు ఆలయానికి చేరుకోగానే మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, దేవదాయ శాఖ కమిషనర్, దేవాలయ పాలక మండలి ఛైర్మన్, ఈవో, ఆలయ కమిటీ సభ్యులతో పాటు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

సీఎం చంద్రబాబుకు వేద పండితులు పరివట్టం చుట్టారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. దర్శాననంతరం ముఖ్యమంత్రి దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనమిచ్చి..తీర్ధ ప్రసాదాలు అందించారు. సీఎంకు అమ్మవారి చిత్రపటాన్ని మంత్రి ఆనం అందించారు.

దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలకు సేవలందిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ‘ప్రభుత్వం తరపున దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు అందించాలని కోరుకున్నాను. దుర్గమ్మ దయతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. ప్రాజెక్టులన్నీ జలకళతో ఉన్నాయి. ప్రజలంతా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి…రాష్ట్ర సంపద పెరగాలి. నవరాత్రుల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.

ఇవాళ ఒక్క రోజే 1.20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. పవిత్రతను కాపాడుతూ ఎక్కువ మందికి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. ప్రసాదంలో నాణ్యత పెంచాం, వీఐపీ దర్శనాలను క్రమబద్దీకరించాం. ఎక్కువ సమయం సాధారణ భక్తులకే కేటాయించాం.” అని సీఎం చెప్పారు.

“దుర్గమ్మ ఆశీస్సులతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. ప్రజలకు సేవ చేస్తున్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను దుర్గమ్మ ఆశీర్వదించాలని కోరుకున్నాను. 2014-.. 19 మధ్య కాలంలోనే దుర్గగుడి అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. నేడు మళ్లీ అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఒకేసారి 1,500 మందికి సరిపడేలా రూ.26 కోట్లతో అన్నప్రసాద భవనం నిర్మిస్తున్నాం. ఆరు నెలల్లో దీన్ని అందుబాటులోకి తెస్తాం. రూ.27 కోట్లతో కొత్త ప్రసాదం తయారీ కేంద్రాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తాం.

రూ.5 కోట్లతో పూజా మండపం, దాతల సహకారంతో యాగశాల నిర్మిస్తాం. రూ.14 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ వంటి వాటిని ఐదు నెలల్లో పూర్తి చేస్తాం. 2027 గోదావరి, 2028 కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహిస్తాం. ప్రభుత్వం చేసే మంచి పనులకు దుర్గమ్మ దీవెనలు ఉండాలి. దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నాం. దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాం. తిరుమల కొండపై ఉన్నంత స్థలం..ఇంద్రకీలాద్రిపై లేదు.

విజయవాడ నగరంలోనే వసతి ఏర్పాటు చేసుకోవాలి. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. ఆదాయం లేని దేవాలయాలకు ప్రభుత్వం నిధులు ఇస్తోంది’ అని ముఖ్యమంత్రి వివరించారు.

Leave a Reply