నేటి మధ్యాహ్నం జరుగుతాయని ప్రకటన
సాయంత్రానికి వాయిదా పడినట్లు కేంద్రం ప్రకటన
రెండు దేశాలకు చెందిన డీజీఎంవోలతో హాట్ లైన్ లో చర్చలు
న్యూ ఢిల్లీ|భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నేటి మద్యాహ్నం జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. నేటి మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయని అధికారవర్గాలు ముందుగా వెల్లడించాయి. అయితే ఈ చర్చలు నేటి సాయంత్రం 5గంటల జరగనున్నట్లు కేంద్ర ఒక ప్రకటనలో తెలిపింది. హాట్లైన్ వేదికగా జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆఫరేషన్స్ (డీజీఎంవో)లు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఎటువంటి షరతులు లేకుండా తాము చర్చలలో పాల్గొంటామని ఇప్పటికే భారత్ ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే ఇరుదేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు తొలుత పాకిస్థాన్ డీజీఎంవో నుంచి భారత డీజీఎంవోకు హాట్లైన్ కాల్ వచ్చింది. ఈ సందర్భంగా పాక్ వైపునుంచి కాల్పుల విరమణ అంశానికి సంబంధించి ప్రతిపాదన వచ్చింది. దానిపై భారత్ సానుకూలంగా స్పందించడంతో కొద్దిగంటల్లోనే ఒప్పందం అమల్లోకి వచ్చింది.
హాట్లైన్ చర్చల ఎజెండా గురించి స్పష్టమైన ప్రకటన వెలువడనప్పటికీ, భారత విదేశాంగ శాఖ మాత్రం పీవోకేనే కీలకమని చెబుతోంది. కాశ్మీర్ విషయంలో భారత్కు స్పష్టమైన వైఖరి ఉందని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం మినహా చర్చలలో మరో ప్రధాన విషయం ఏమీ ఉండదని తెలిపింది. అంతకు మించి మాట్లాడేది లేదని పేర్కొంది. ఉగ్రవాదుల విషయంలో వాళ్లు మాట్లాడితే మేమూ మాట్లాడతాం. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.
త్రివిద దళాధిపతులతో మోడీ భేటి
మరోవైపు, ప్రధాని మోదీ నివాసంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, త్రివిధ దళాల అధిపతులు, పలువురు ఉన్నతస్థాయి సైనికాధికారులు సమావేశమయ్యారు.
మోడీ-డోభాల్ ప్రత్యేక సమావేశం
తన నివాసంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మోదీతో అజిత్ డోబాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్, పాక్ చర్చల నేపథ్యంలో వివిధ అంశాలపై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. డీజీఎంవో చర్చల నేపథ్యంలో ఆదివారం మోదీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ఆదేశించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా కశ్మీర్ అంశంపై పాక్తో ఎలాంటి చర్చలు ఉండవని ప్రధాని స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని తేల్చి చెప్పాయి. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ ) వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది.