నంద్యాల బ్యూరో, జూన్ 19 (ఆంధ్రప్రభ) : మస్కట్ లో ఇబ్బందులు పడుతున్న జిల్లాలోని చామలమర్రికి చెందిన హుస్సైనమ్మను జిల్లా పోలీసులు క్షేమంగా రప్పించారు. కొద్ది రోజుల క్రితం జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు మస్కట్లో ఉన్న హుస్సైనమ్మ ఒక సెల్ఫీ వీడియోను పంపింది. ఆ వీడియోలో ఆమె తీవ్రమైన మనస్తాపంతో ఉన్నానని, తాను ఇక బతకలేనని, తనను కాపాడాలని వేడుకున్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ వెంటనే ఆళ్లగడ్డ పోలీసులను అప్రమత్తం చేశారు. ఆమెకు సంబంధించిన వివరాలు సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈవిషయంలో వెంటనే స్పందించిన ఆళ్లగడ్డ పోలీసులు సంబంధిత ఏజెంట్లతో, మిగిలిన వ్యక్తులతో సంప్రదించి ఆమె కోసం విమాన టికెట్లను బుక్ చేయించారు. సమాచారం అందిన 48గంటలలోనే ఆమెను గుర్తించి, తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసి, చాగలమర్రిలో ఆమె కుటుంబానికి సురక్షితంగా చేర్చారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మార్గనిర్దేశంలో ఆళ్లగడ్డ పోలీసులు చూపిన శీఘ్ర స్పందన, చక్కటి నిర్వహణ మహిళల రక్షణ పట్ల నంద్యాల జిల్లా పోలీసుల కమిట్మెంట్ టు విమెన్ సేఫ్టీ స్పష్టంగా చాటుతోందన్నారు. ఆ మహిళని క్షేమంగా ఇంటికి చేర్చారు.