ఈ ప్రపంచంలోని సకల వస్తు సముదాయము భగవంతుని సంపదయే. అర్హత ననుసరించి భగవంతుడు జీవులకా సంపదను అనుగ్రహించాడు. అందువల్ల మనకు భగవంతుడు అనుగ్రహించిన దానిని అనుభవించడం ధర్మమే కాని పరుల సొమ్మును బలవంతంగా లాక్కోవడం అమానుషం, అధర్మం అంటుంది ఈశోపనిషత్తు. సాధారణంగా మానవులు మరణించేందుకు ఇష్టపడరు. జీవించినంతకాలం ఏవో కర్మలను చేయాల్సిందే.. అయితే సత్కర్మల నాచరిస్తూ వంద సంవత్సరాలు జీవించాలని మహర్షులు బోధిస్తున్నారు (శతాయుర్వైపురుష:-వేదం). శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వంద సంవత్సరాలు జీవిస్తాడని మహర్షులు చెపుతున్నారు. దీనిని బట్టి జీవితానికి అర్థం పరమార్థం ఉన్నదని మనకు అవగతమౌతుంది.
ధార్మికమార్గంలో భౌతిక జీవిత కార్యక్రమాలు నిర్వహిస్తూనే, తాత్త్విక జ్ఞానాన్ని సాధించడం, జీవితానికి అన్వయించుకోవడం, రెంటినీ సమన్వయం చేసుకోవడం ద్వారా ఉదాత్తమైన, ఉన్నతమైన విలువలతో కూడిన వ్యక్తిత్వం ఆవిష్కృతమౌతుంది. అది ఉల్లాసభరితమైన, అనందమయమైన రసమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. అయితే బాహ్య ప్రపంచంలో విజయం సాధించాలి అంటే.. అంతర్గత ప్రపంచంలో ముందుగా విజయాన్ని సాధించాలి. బాహ్య అంతర్గత ప్రపంచాలలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిని చేరుకోవడమే పరిపూర్ణ జీవనాన్ని సాధించడం, ఆస్వాదించడం.
ప్రతివ్యక్తికీ ఏదో సాధించాలనే తపనతో కూడిన ఆశయాలు ఉంటాయి. ఆశయాలను సాకారం చేసుకోవడం చాలామందికి కుదరకపోవచ్చు. కారణం ఏమిటి? అంతర్గతంగా మహత్తరమైన శక్తిసామర్ధ్యాలు ఉన్నా వాటిని గుర్తించకపోవడం, నేను సాధారణమైన వాడిననే పరిమితులను విధించుకోవడం వల్ల ఆశయాలు ఆశలుగానే మిగిలిపోతున్నాయి. మనలోని శక్తిసామర్ధ్యాలు గుర్తించి, మేల్కొల్పి ఆచరణలో పెడితే జీవితం అనూహ్యమైన విధానంలో ఆవిష్కృతమౌతుంది. పరాజయం పాలైన వారిని పలకరిస్తే తమ పరాజయానికి కారణం పరిస్థితులు అంటారు. నిజానికి పరిస్థితులు మనం సృజించుకున్నవే కాని మనలనవి సృష్టించలేదు. జీవితంలో సమస్యలు లేనివారు ఎవరూ ఉండరు. కొందరు సమస్యలను అవకాశాలుగా మార్చుకుంటారు.. కొందరా సమస్యలకు బెదిరి ప్రయత్నాన్ని విరమించుకుంటారు. బండరాళ్ళు అడ్డకుండా ఉంటే జలపాతం యొక్క మనోహరమైన సంగీతాన్ని వినగలమా? వంకరలు తిరుగుతూ, సుడులతో, వేగంగా పరుగులు తీస్తేనే నదులు తమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాయి. అంధకారాన్ని గెలువగలననే ఆశయంతో దానితో అనునిత్యం యుద్ధంచేయడం వల్లనే సూర్యుడు జగత్తుకు వెలుగునిస్తున్నాడు. నేలను చీలుస్తూ తలెత్తి ఎదిగితేనే విత్తనం మొలకెత్తుతుంది. బురదలో వేళ్ళూనుకుంటేనే తామెరపూవుకు ఉనికి కలుగుతుంది. ఇలా ప్రకృతిలో ప్రతిదీ… అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగితేనే తన జీవితానికి సార్ధకతను పొందుతుంది. బద్ధకం లక్షణంగా, వాయిదా వేసుకునే వ్యాధిపీడితులు, ఊహాలోకాలలో విహరిస్తూ నిజజీవితాన్ని నీరసమయం చేసుకుంటారు. దానికి ప్రతిగా విజయ సాధకుల జీవితాలను పరిశీలిస్తే వారు పరిస్థితులను తమ బానిసలుగా చేసుకున్న విధానం అవగతమౌతుంది.
నిజానికి హృదయమనే కన్నులను విప్పి పరిశీలిస్తే మనచుట్టూ అవకాశాల రూపంలో ఉన్న అంతులేని
ఐశ్వర్యాన్ని చూడగలుగుతాము. విశ్వాసమనే కరదీపిక సహాయంతో, ఉత్సాహమనే సహచరునితో కలసి, ధైర్యసాహసాలనే ఉపకరణాల సహాయంతో, బుద్ధి చూపిన మార్గంలో, శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తే అభ్యుదయం అనే పెన్నిధిని సాధించ గలుగుతాము. అయితే ఆ ఐశ్వర్యాన్ని చూడలేకపోవడానికి కారణం ఏమిటి? మనసే..! మనుష్యులకు బంధనాలకు గానీ, విముక్తికి కానీ కారణమవుతుంది. విజయాన్ని సాధించి పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదించాలన్నా, అపజయాల పరంపరను మూటగట్టుకొని అనామకునిలా జీవితాన్ని ముగించాలనుకున్నా, అది మనసు వల్లనే సాధ్యపడుతుంది. మనసును అదుపులో పెడితే జీవితం అదుపులో ఉంటుంది. జీవితం అదుపులో ఉంటే రసమయమైన పరిపూర్ణతను సాధించడానికి మార్గం సుగమమౌతుంది. ఉదాత్తమైన లక్ష్యం ప్రేరణనిస్తే అచంచలమైన దీక్ష కర్తవ్యానికి మార్గం చూపితే సాధించాలనే తపన పరిమితుల హద్దులను చెరిపివేస్తే, ఆలోచనలు అంబరాన్ని చుంబిస్తాయి. అంతర్గత చైతన్యం విస్తృతిని పొంది సమస్త అవకాశాలూ కరతలామలకం అవుతాయి. నిద్రాణమైన శక్తులు ఉత్తేజితమౌతాయి. తెలివితేటలకు జీవం వస్తుంది. సాధనకన్నా లక్ష్యం చిన్నదిగా మారుతుంది. శ్రేష్ఠత సోపానమౌతుంది. విజయం సాధకుని ముందు మోకరిల్లుతుంది. పరిపూర్ణత జీవన విధానమౌతుంది. అలాంటి జీవితాన్ని అలవరచుకోమని, పరిపూర్ణతవైపు పయనించమని ఉపనిషత్తులు మానవుకోటికి ప్రబోధిస్తున్నాయి.
- పాలకుర్తి రామమూర్తి