హైదరాబాద్ : ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుండబోతున్నాయన్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, ఇందుకు యావత్ దేశం అండగా నిలవాలని కోరారు.
హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ఇవాళ నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్రకాశ్, వి.సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… 10లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మోడీ అన్నారు. 2022 అక్టోబర్ 22న ప్రారంభమైన ‘రోజ్ గార్ మేళా’ నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసినమన్నారు.
ఈరోజు 15వ రోజ్ గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. అంటే దాదాపు 10లక్షల మార్క్ కు చేరుకున్నట్లే… ఏ చిన్న అవినీతికి, పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోగా ఇన్ని లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం మామూలు విషయం కాదు. మోడీ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కిందన్నారు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుంటే.. ఇతర ఉద్యోగులపై భారం పడుతోంది. తద్వారా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించడం కష్టమైందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఏ శాఖలో ఖాళీగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆయా పోస్టులను ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసిన దాఖలాల్లేవ్. ఆ ఘనత మోడీకే దక్కుతోందన్నారు.
దేశవ్యాప్తంగా ఈరోజు 47కేంద్రాల్లో రోజ్ గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. 51 వేల మందికి అపాయిట్ మెంట్ లెటర్లు ఇవ్వడం గొప్ప విషయం. మన రాష్ట్రం విషయానికొస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ లో నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ఎంసీహెచ్ఆర్డీ కేంద్రం నుండి సుమారు 700మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్నారు. వీరిలో 100మంది అభ్యర్థులకు తన చేతుల మీదుగా నియమాక పత్రాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు అపాయిట్ మెంట్ లెటర్లు అందుకోబోతున్న అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు. వాస్తవానికి ఒక్కో పోస్టుకు భారీ ఎత్తున పోటీ నెలకొంది. ఆ పోటీని తట్టుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించిన మీ అందరికీ హ్యాట్సాఫ్ అన్నారు.
ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించిన మీరంతా ఇకపై మీకు అప్పగించిన బాధ్యతలను ఇష్టపడి నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చుకోండి. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీని, ఉద్యోగాల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగండి. మీకు తెలుసు. ఉద్యోగావకాశాల సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది మోడీ సంకల్పం. అందుకే 10లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకోగలిగామన్నారు.