కంకర లోడు..అతి వేగం…
చేవెళ్ల, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కంకర లోడుతో వస్తున్న లారీ ఢీకొంది.
బస్సు ఎడమ వైపు టిప్పర్ దూసుకుపోవడంతో సీట్లలో కూర్చున్న ప్రయాణికులు నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం.
ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి.. తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
సీఎం దిగ్భ్రాంతి… విచారణకు ఆదేశం
ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం తెలియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి చెందారు. తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

