గుట్టలో భద్రతా బలగాలకు, నక్స ల్స్ మధ్య హోరాహోరి పోరు
ఇప్పటికే అయిదుగురు నక్సల్స్ హతం
ల్యాండ్ మైన్స్ ను తొలగించుకుంటూ ముందుకు వెళుతున్న బలగాలు
తీవ్రంగా ప్రతిఘటిస్తున్న మావోయిస్ట్ లు
భయం గుప్పిట్లో చత్తీస్ గడ్ – తెలంగాణ బోర్డర్ గిరిజనులు
చత్తీస్ గడ్ -తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ తీవ్రతరమైంది. నేడు ఇక్కడ జరిగిన ఎదురెదురు కాల్పులలో అయిదుగురు నక్సలైట్లు మరణించారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య తీవ్రంగా కాల్పులు కొనసాగుతున్నాయి.. ఏ క్షణంలో నైనా కర్రెగుట్టను స్వాధీనం చేసుకునే విధంగా భద్రతా బలగాలు లోనికి చొచ్చుకుపోతున్నాయి.
కాగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ నేటికి నాలుగు రోజుకి చేరింది.. నేడు కూడా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, బస్తర్ఫైటర్స్ బలగాలకు చెందిన సుమారు 12వేల మంది భద్రతా సిబ్బంది (తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు) పాల్గొంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో 800 నుంచి 900 మంది మావోయిస్టులు, వీరిలో హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఉన్నారన్న పక్కా నిఘా సమాచారంతో బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. కాగా నేడు జరిగిన కాల్పులలో అయిదుగురు మావోయిస్ట్ లు మరణించారు.. ఇరువైపుల నుంచి తుపాకులు పేలుతున్నాయి.
ఆపరేషన్ కగార్ కర్రెగుట్టలో నేటి ఉదయం మరింత తీవ్రమైంది.. ఈ ప్రాంతం బాంబుల మోత మోగుతోంది. కర్రె గుటల్లో మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతున్నది. హిడ్మా దళం ఆచూకీ కనిపెట్టేందుకు 12 వేల మందితో కూడిన భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని కర్రె గుటల్లో రెండ్రోజులుగా మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.
పోలీసుల దిగ్భంధం
అడుగడుగునా పోలీసుల దిగ్బంధం, రహదారుల మూసివేత కారణంగా సామన్యులెవరూ కర్రెగుట్టల వైపు వెళ్లడానికి సాహసించడం లేదు. గుట్టలు. బాంబుల మోతతో దద్దరిల్లుతుండడాన్ని స్థానికులు నిర్దారించారు. అయితే.. భీమారంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు బేస్ నుంచి ముందుకు వెళ్లడానికి వీల్లేదని గ్రామస్థులను నిలిపివేశారు. అలాగే చుట్టూ పక్కల ఉన్న ఆదీవాసీలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బలగాలు హెచ్చరించాయి. మావోయిస్టులు సేఫ్ జోన్గా ఏర్పరచుకున్న స్థావరాల వద్దకు పోలీస్ బలగాలు చేరు కున్నాయి. ఈ బలగాలకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సరుకులను హెలికాప్టర్లో సరఫరా చేస్తున్నారు. బు వెంకటాపురం మండల కేంద్రంలో రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యాయి. ఆ హెలికాప్టర్ల నుంచి వాటర్ బాటిల్స్, కొన్ని బాక్సులు గుట్టల వద్దకు తీసుకుపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
అడవుల్లోకి రావొద్దని ప్రజలకు హెచ్చరిక..
అడవుల్లోకి రావొద్దని సమీప గ్రామాల ప్రజలకు రెండ్రోజుల క్రితమే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. విధుల్లో భాగంగా గుట్టల వద్దకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు తెలిపినట్టు అటవీ శాఖ సిబ్బంది కూడా చెబుతున్నారు. రెండ్రోజులుగా గుట్టల్లో ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు స్థానిక గిరిజనులు చెబుతున్నారు. అడవిలో కాల్పులు జరిగినట్టు, భారీగా శబ్దాలు వస్తున్నట్టు సమీప గ్రామాల్లోని ప్రజలు పేర్కొంటున్నారు. అయితే అసలు గుట్టల్లో ఏం జరుగుతున్నది? అనే వివరాలు మాత్రం పోలీసులు చెప్పడం లేదు. కాగా, కర్రె గుటల్లో కూంబింగ్ జరుగుతున్న మాట వాస్తవమేనని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ చెప్పారు. చత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు అందులో పాల్గొంటున్నాయని తెలిపారు. అయితే ఎన్కౌంటర్లో ఎందరు చనిపోయారు? అనే విషయం తమకు తెలియదని చెప్పారు.
మందుపాతరల నిర్వీర్యం..
కాగా గత కొంతకాలం క్రితమే కర్రెగుట్టల చుట్టూ మందుపాతరలు అమర్చామని సామాన్యులు అటువైపు వచ్చి ప్రాణాలు కోల్పొవద్దని మావోయిస్టులు హెచ్చరించారు. తాజాగా పోలీసు బలగాలు గుట్టను చుట్టుముట్టడంతో పాటు గుట్టల చుట్టూ జల్లడపడుతున్నాయి. సుమారు 4 వేల మందికి పైగా సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, బస్తర్ఫైటర్స్ బలగాలతోపాటు.. తెలంగాణ పోలీసులు కూడా కర్రెగుట్టలను చుట్టుముట్టిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు కూంబింగ్ కొనసాగిస్తూనే.. బాంబ్ డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్లు గుట్టల చుట్టూ మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించి, నిర్వీర్యం చేస్తున్నాయి. తెలంగాణ వైపు.. వెంకటాపురం మండలంలోని రాచపల్లి కలిపాక, మోట్లగూడెం ప్రాంతాల వరకు కూడా బాంబు పేలుడు శబ్దం వినిపిస్తోందని స్థానికులు తెలిపారు. ఈ పేలుళ్లు మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను బలగాలు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో సంభవిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, మావోయిస్టులు కూడా భద్రతా బలగాలను ప్రతిఘటిస్తున్నాయి,
మావోయిస్టులు తలదాచుకున్న ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టి, డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ భారీ ఆపరేషన్తో భీమవరం పాడు, పూజారి కాంకేర్, పామేడు, ఊసూరు వంటి సరిహద్దు గ్రామాల్లో భయాందోళనలు, ఉద్రిక్త అడవుల్లో భారీగా మందుపాతరలు అమర్చామని హెచ్చరికలు చేస్తున్నారని తెలుస్తోంది. మావోయిస్టులను పూర్తిగా చుట్టుముట్టామని, వారికి లొంగిపోవడం లేదా హతమవ్వడం తప్ప మరో మార్గం లేదని బస్తర్ పోలీసులు ప్రకటించినట్లు సమాచారం. దీంతో కర్రెగుట్ట ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.