న్యూ ఢిల్లీ | భూకంప విలయంలో చిక్కుకున్న మయన్మార్ను ఆదుకోవడం కోసం భారత్ ముందుకు వచ్చింది. మయన్మార్కు ఆపన్న హస్తం అందించింది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్ ప్రజలకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. 15 టన్నుల ఆహారం, మందులు, జనరేటర్లు, దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, హైజీన్ కిట్లు వంటి అత్యవసరాలను మయన్మార్కు తరలించింది. అలాగే అక్కడ సహాయ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆర్మీకి చెందిన నిపుణులను ప్రత్యేక విమానాలలో తరలిస్తున్నది.. అక్కడ భవనాల శిధిలాలను తొలగించేందుకు ఇంజనీర్లతో కూడిన బృందాన్ని పంపింది. అక్కడి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయకార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నది..

బ్యాకాంక్ నుంచి పర్యాటకులు తిరుగు టపా ..
థాయ్లాండ్లో భూకంపం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చారు. వారంతా కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. భూకంపం నేపథ్యంలో మయన్మార్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు కుప్ప కూలిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మయన్మార్, థాయ్లాండ్ భూకంప తీవ్రతను తెలిపే వీడియోలు, ఫొటోలే కనిపిస్తున్నాయి.
