శ్రీకాకుళం, మే 13(ఆంధ్రప్రభ): అత్యవసర, ప్రమాద సమయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ లో మంగళవారం రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఎపి స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్, తదితర శాఖలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఉగ్రవాదులు, బాంబు పేలుడు, ఇతర దేశాల నుండి దాడి జరిగితే ఏమి చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. కలెక్టరేట్ లో ఉన్న కంట్రోల్ రూంకు ప్రమాదంపై కలెక్టరేట్ కు సమాచారం ఇస్తే అక్కడి నుండి పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, సివిల్ డిఫెన్స్, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్, తదితర శాఖలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు.
జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే ఆమదాలవలస, పలాస రైల్వే స్టేషన్ లో ప్రజలకు అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్వీయ రక్షణ పొందడం, పోలీసు, రెవిన్యూ, ఆగ్ని మాపక శాఖల వంటి ప్రభుత్వ విభాగాలు సహాయక చర్యలు చేపడతాయని ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సివిల్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ఉగ్రవాదుల దాడులు, పేలుడు పదార్థాలు ఉన్నాయని సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న కంట్రోల్ రూమ్ కి వచ్చిన సమాచారం మేరకు జిల్లాలో వివిధ విభాగాలు ఏ విధంగా తక్షణ స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ప్రజల రక్షణ, నియంత్రణ చర్యలు ఏ విధంగా తీసుకోవడం జరుగుతుందని ఈ సివిల్ మాక్ డ్రిల్ రూపంలో నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె. సాయి ప్రత్యూష, మునిసిపల్ కమిషనర్ ప్రసాద్ రావు, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, ఎఆర్ డిఎస్పీ శేషాద్రి, జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు, ఆర్టీసీ ఆర్ఎం విజయ్ కుమార్, ఎపి స్టేట్ ఆర్డీ ఎఫ్, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, తదితర శాఖలు మాక్ డ్రిల్ లో పాల్గొన్నాయి.
