One Day Series | నీ వల్ల.. ఏం ఉపయోగం లేదు..

One Day Series | నీ వల్ల.. ఏం ఉపయోగం లేదు..
- టీమిండియా కోచ్ గంభీర్పై తీవ్ర విమర్శలు
- సోషల్మీడియాలో ట్రోల్ చేస్తున్న అభిమానులు
One Day Series | వెబ్డెస్క్ (స్పోర్ట్స్), ఆంధ్రప్రభ : టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు తేలిపోతోంది. వన్డే, టెస్టు ఫార్మట్లలో పరాజయాలను ఎదుర్కొంటోంది. టీ20 ఫార్మాట్ మినహాయిస్తే వన్డే, టెస్టుల్లో భారత జట్టు స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించడం లేదు. జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ జట్టు పరాజయం పాలవుతుండటంతో అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వన్డే సిరీస్ను కోల్పోయిన తర్వాత గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వన్డే సిరీస్ను కోల్పోయింది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత గడ్డపై 37 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ను గెలిచి కివీస్ చరిత్ర సృష్టించింది.

దీంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది. సొంతగడ్డపై చెలరేగాల్సిన భారత జట్టు.. గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస ఓటములను చవిచూస్తోందంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్తో గంభీర్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

కోచ్ గంభీర్ చేస్తున్న అనవసర ప్రయోగాలు భారత ఓటమి పాలవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆటగాడిగా దూకుడును ప్రదర్శించిన గంభీర్.. కోచ్గా అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఫామ్లో లేని జడేజాను పదే పదే ఆడిస్తుండటం.. అక్షర్ పటేల్ను పక్కన పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. గంభీర్ బాధ్యతలు చేపట్టాక సొంతగడ్డపై కివీస్, దక్షిణాఫ్రికాలకు టెస్టు సిరీస్లు కోల్పోయిన నేపథ్యంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న గంభీర్.. ఇప్పుడు వన్డే సిరీస్ పరాభవంతో మరింత ఒత్తిడిని ఎదుర్కోనున్నాడు.
