AP | పేద‌ల గౌర‌వ‌ప్ర‌ద జీవితానికి ఎన్‌టీఆర్ భ‌రోసా.. ప్ర‌త్యేక అధికారి జ‌య‌ల‌క్ష్మి

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : పేద‌లకు ఎన్‌టీఆర్ భ‌రోసా ద్వారా సామాజిక భ‌ద్ర‌తతో పాటు గౌర‌వ‌ప్ర‌ద జీవితానికి భ‌రోసా ఏర్ప‌డుతోంద‌ని.. స్వ‌ర్ణాంధ్ర 2047 దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో పీ4 వంటి వినూత్న విధానాల‌ను ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ట్లు రాష్ట్ర భూ ప‌రిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీసీఎల్ఏ ), ఎన్‌టీఆర్ జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి అన్నారు. ఎన్‌టీఆర్ భ‌రోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శ‌నివారం సీసీఎల్ఏ, ఎన్‌టీఆర్ జిల్లా ప్ర‌త్యేక అధికారి జ‌య‌ల‌క్ష్మి.. జిల్లా క‌లెక్ట‌ర్ డా.జి.ల‌క్ష్మీశ‌, అధికారుల‌తో క‌లిసి విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని బృందావ‌న్ కాల‌నీలో పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వార్డు స‌చివాల‌య కార్య‌ద‌ర్శులు, ప్ర‌భుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్ష‌న్లు అందిస్తున్న ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు.

కేట‌గిరీల వారీగా ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ మొత్తం స‌రైన విధంగా అందుతుందా.. లేదా ? అనే విష‌యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా జి.జ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ.. జూన్ 1 ఆదివారం కావ‌డంతో ఒక‌రోజు ముందుగానే మే 31న శ‌నివార‌మే పెన్ష‌న్లు అందించ‌డం జ‌రుగుతోంద‌ని, ఎక్క‌డా ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పెన్ష‌న్ల మొత్తాన్ని ల‌బ్ధిదారుల ఇళ్ల వ‌ద్దే అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయి మెరుగుప‌డేలా ప్ర‌భుత్వ సేవ‌లందించేందుకు కృషి చేస్తున్న‌ట్లు జ‌య‌ల‌క్ష్మి వివ‌రించారు.

పెన్ష‌న్ల పంపిణీపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌..
ఎన్‌టీఆర్ జిల్లాలో ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద 2,27,786 పెన్ష‌న్ల‌కు దాదాపు రూ. 98.11కోట్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంద‌ని, క్షేత్ర‌స్థాయిలో అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఇళ్ల వద్ద పెన్ష‌న్ల పంపిణీ స‌జావుగా సాగేలా చూస్తున్నార‌నీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎంతో క‌లిసి శ‌నివారం విజ‌య‌వాడ అర్బ‌న్‌, స‌త్య‌నారాయ‌ణ‌పురంలో పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ల‌బ్ధిదారుల‌తో మాట్లాడి పెన్ష‌న్లు అందుకోవ‌డంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, పెన్ష‌న్ స‌మాయానికి అందుతోందా ? అని అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, యూసీడీ పీవో పి.వెంక‌ట నారాయ‌ణ, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *