న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సిద్ధమైంది. పట్టాలెక్కెందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తుండగా.. హైడ్రోజన్తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. జులై నుంచి హరియాణాలోని జీంద్ జిల్లాలో ఈ రైలు పరుగులు తీయనుంది. జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది. ఈ రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం రెండు నెలల్లో పూర్తికానున్నట్లు ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ వర్మ తెలిపారు. చెన్నైలో తయారు చేస్తున్న రైలును జీంద్ కు తీసుకువచ్చాక ట్రయల్ రన్ జరుగుతుందని చెప్పారు. ఈ రైలు ప్రారంభం అయిన తరువాత దశల వారీగా విస్తరణ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
రూ. 80 కోట్ల ఖర్చు
భారతీయ రైల్వేశాఖ హైడ్రోజన్తో నడిచే తొలి రైలును అందుబాటులోకి తీసుకురానుంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్ను రూపొందించింది. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైడ్రోజన్ పర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద హైడ్రోజన్ పవర్తో నడిచే 35 రైళ్లను నడపాలని రైల్వే భావిస్తోంది. ప్రతి రైలుకు దాదాపు 80 కోట్లు ఖర్చు అవుతోంది. గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదనంగా రూ.70 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. హెరిటేజ్, హిల్స్టేషన్స్ రూట్స్లో ఈ రైళ్లను నడపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
తుది దశకు పనులు
హైడ్రోజన్తో నడిచే రైలు నిర్మాణ పనులు చెన్నైలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆ పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. ఇక్కడ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, భద్రత కోసం పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. చెన్నైలో తయా రు చేస్తున్న రైలును జీంద్కు తీసుకువచ్చాక ట్రయల్ రన్ జరుగుతుందని తెలిపారు. జీంద్, సోనిపత్ మధ్య సజావుగా ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. అయితే హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం రెండు నెలల్లో పూర్తవుతుంది.