న్యూ ఢిల్లీ: పార్లమెంట్లో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ , రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,ని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం నేడు కలిశారు. ఈ సందర్బంగా జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ల ధర్నా వివరాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వివరించారు. మంత్రులు, ఎంపీలను సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించారు.
నేతలు మరింత కష్టపడాలి.. సోనియాగాంధీ
అధిష్టానం పెద్దలతో తెలంగాణ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. 2008లో సోనియా గాంధీని కలిశానని పాత జ్ఞాపకాలను ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై జంతర్ మంతర్లో పాల్గొన్నట్లు సోనియాకు విప్ ఆదిశ్రీనివాస్ వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని ఈ సందర్భంగా నేతలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్కు వెన్నంటే ఉన్నారని వారికి చేసే మేలు ప్రజలు మరవరని అన్నారు. బీసీ రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు లు తెస్తాయని ఉద్ఘాటించారు. నేతలు మరింత కష్టపడాలని.. అందరికి సంక్షేమ పథకాలు అందించాలని సోనియా సూచించారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్లో మోదీ ప్రభుత్వంతో బలంగా కొట్లాడుతామని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర వైఖరిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ తెలిపారు. సోనియా , రాహుల్ గాంధీలతో భేటీ అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

బీసీలకు మంత్రి పదవులపై చర్చ …
బీసీలకు మరో రెండు మంత్రిపదవులు ఇవ్వాలని కోరామని.. ఇద్దరికీ ఇచ్చే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీలకు మంచి చేసిన ఘనత కాంగ్రెస్దేనని చెప్పారు. ఇవాళ సోషల్ జస్టిస్ మంత్రిని కలవనున్నామని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసే అవకాశం లేదని చెప్పారు. బీజేపీ నేతలు అపాయింట్మెంట్ తీసుకుంటే తాము భేషజాలు లేకుండా వారితో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మతపరమైన రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వడం లేదన్నారు. ముస్లింలు ఈ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. ముస్లింలు బీసీల్లో ఉన్నారని.. దానిలో భాగంగానే రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు బిల్లు తీసుకువచ్చామని గుర్తుచేశారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తామని తాము ఎక్కడ చెప్పలేదని అన్నారు. ఏఐసీసీ పరిధిలో ఉన్న అంశం వారే నిర్ణయం తీసుకుంటారని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.