హైదరాబాద్ : ఎప్పుడు లేని విధంగా నిన్నజరిగిన నీట్ ప్రశ్నాపత్రం చూసిన విద్యార్ధులకు కన్నీళ్లే వచ్చాయి.. ఏ విభాగంలో చూసినా అన్ని కఠినమైన ప్రశ్నలే.. అసలు ప్రశ్న అర్దం చేసుకునేంత సమయం కూడా లేకుండా ఆయోమయానికి గురి చేసే విధంగా ప్రశ్నలు ఈ సారి సంధించారు.. మెరిట్ విద్యార్ధులు సైతం పేపర్ ను ఘోల్లు మంటున్నారంటే ఎంత ఘాటుగా అర్ధం అవుతుంది.
ఇక భౌతిక శాస్త్రం – ఫిజిక్స్ లో 16 ప్రశ్నలు బెంబేలెత్తించాయి! రసాయన శాస్త్రంలో 15 ప్రశ్నలు బెదరగొట్టాయి!! బోటనీలో 14, జువాలజీలో ఆరు ప్రశ్నలు చాలా కష్టంగా వచ్చాయి! ఒక్కమాటలో చెప్పాలంటే.. వైద్య విద్యలో ప్రవేశాల నిమిత్తం ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్-యూజీ 2025) ప్రశ్నపత్రం ఘాటుగా, అత్యంత కఠినంగా ఉంది!
మునుపెన్నడూ లేనంత..
నీట్ యూజీ 2018లో మొదలైంది. నాటి నుంచి కిందటి సంవత్సరం దాకా.. ఏ ఏడాదీ నీట్ ప్రశ్నపత్రం ఇంత కఠినంగా లేదని అధ్యాపకులు, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్ ప్రశ్నలు తమను బెంబెలెత్తించినట్లు విద్యార్థులు వెల్లడించారు. నీట్ పేపర్లో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో మొత్తం 180 ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్లో 45 ప్రశ్నలకుగాను 20-25 ప్రశ్నలకు జవాబు రాస్తే చాలా గొప్పేనని నిపుణులు చెబుతున్నారు. మెరిట్ విద్యార్థులు సైతం ఫిజిక్స్లో 30ప్రశ్నలకు మించి సమాధానాలు రాయలేకపోయారని.. ఎవరైనా 40ప్రశ్నలకు సమాధానాలు రాస్తే ఆలిండియా ర్యాంకు తథ్యమని వస్తుందని పేర్కొన్నారు. అలాగే, కెమిస్ట్రీలో ఆరు ప్రశ్నలను అత్యంత కఠినంగా ఇచ్చారని, అవి సుదీర్ఘంగా, సమయం ఎక్కువ తీసుకునేలా ఉన్నాయని ఓ ప్రముఖ విద్యా సంస్థలో కెమిస్ట్రీ సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్న జె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. బోటనీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని.. కొన్ని ప్రశ్నలు కష్టంగా ఇచ్చారని ఆయ న వెల్లడించారు. అయితే మెజారిటీ విద్యార్థులు ఆ ప్రశ్నలకు బాగానే సమాధానాలు రాసినట్టు చెబుతున్నారు. జువాలజీలో 3-4 ప్రశ్నలు అర్థం కాలేదని కొంతమంది పేర్కొన్నారు. చాలామంది విద్యార్థులు బోర్డు ఎగ్జామ్ సిలబస్ ను పట్టించుకోలేదని.. వాటిలో ప్రశ్నలు అడగడం లేదన్న ధీమాతో ఉంటున్నారని.. కానీ, ఈసారి వాటి నుంచి కూడా ప్రశ్నలు అడిగారని.. నిపుణులు తెలిపారు. ప్రశ్నపత్రం కఠినంగా రావడంతో విద్యార్థులు ఒకరకమైన బాధతో కనిపించారు. కాగా.. నీట్ ఫలితాలను జూన్ 14న వెల్లడిస్తామని జాతీయ పరీక్షా సంస్థ ప్రకటించింది. ఈ నెలఖారులోగా ‘కీ’ విడుదలయ్యే అవకాశం ఉంది.
లాంగ్ టర్మ్ విద్యార్థులకు దెబ్బే..
తెలంగాణలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని పరీక్ష రాసేవారు 12 నుంచి 15 వేల మంది దాకా ఉంటారు. లాంగ్టర్మ్ తీసుకుని నిరుడు పరీక్ష రాసినవారిలో 2వేల మంది వరకూ ఎంబీబీఎస్ సీటు సాధించారని.. ఈసారి మాత్రం ఆ సంఖ్య వెయ్యిలోపే ఉంటుందని నీట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా నీట్ లాంగ్టర్మ్ విద్యార్థులకు భౌతికశాస్త్రమే ఇబ్బందిగా ఉంటుందని.. ఈ ఏడాది అదే కష్టంగా రావడంతో వారు సీటు కొట్టడం చాలా కష్టమని పేర్కొన్నారు.
779 కాలేజీలు.. 1.17 లక్షల సీట్లు
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 779 మెడికల్ కాలేజీల్లో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల కోసం దేశవ్యాప్తంగా 22.7 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు.
450 వస్తే జనరల్లో సీటు!
కిందటి సంవత్సరం చాలామంది విద్యార్థులు 720 మార్కులు సాధించారు. ఈసారి 700 సాధించడమే చాలా కష్టం. ఈ ఏడాది కటాఫ్ బాగా (50-60 మార్కుల మేర) తగ్గే అవకాశం కనిపిస్తోంది. నిరుడు తెలంగాణలో 490 మార్కులు సాధించిన వారికి కన్వీనర్ కోటాలో సీటుదక్కింది. ఈసారి 450 మార్కులు సాధిస్తే జనరల్ కేటగిరీలో సీటు రావొచ్చు.