NDA | 25న ఎన్డీఎ సింఎంల‌తో మోదీ భేటి – హాజ‌రుకానున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్

న్యూ ఢిల్లీ – ఆపరేషన్ సిందూర్‌తో దాయాదికి చుక్కలు చూపించిన తర్వాత ఎన్డీఏ కీలక భేటీ కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 25న సమావేశం జరగనుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని ఎన్డీఏ నేతలకు వివరించనున్నట్లు సమాచారం. ఆపరేషన్‌లో ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడుల గురించి వివరించే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి. ప్రతిపక్ష నేతలు సైతం ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు.

అయితే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాలపై ఎన్డీఏ నేతలకు అవగాహన కల్పించడం ద్వారా విమర్శలను తిప్పికొట్టేలా చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎన్డీఏ కీలక భేటీ జరగనుంది. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేయనున్నారు. ఈ కీలక భేటీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు సమాచారం.

Leave a Reply