విశాఖపట్నం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (Palla Simhachalam) కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నివాళులర్పించారు. గత శనివారం ఆయన స్వర్గస్థులయ్యారు. నేడు ఉదయం విశాఖ సీతంపేట (Seethampet) లోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్.. అక్కడ పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని, విశాఖ-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను మంత్రి గుర్తుచేసుకున్నారు. పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao), ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పల్లా సింహాచలం మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ శ్రీ భరత్, హోంమంత్రి వంగలపూడి అనిత, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.