ఏపీలో కూడా అవార్డులు ప్రకటించాలన్న మురళీమోహన్
ఒక ఏడాది ఏపీ, మరో ఏడాది తెలంగాణలో ఇవ్వాలి
ఒకే సినిమాకు రెండు రాష్ట్రాలు పురస్కారాలు ఇవ్వడం సరికాని అభిప్రాయం
వివాదాల్లేకుండా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా సినిమా అవార్డులను ప్రకటించాలని సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుల ప్రకటన కోసం శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చే విషయంలో ఒక అవగాహనకు రావాలని, వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించాలని హితవు పలికారు.
చర్చలు, వివాదాల్లేకుండా చూద్దాం..
ఒకే తెలుగు సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. “ఇలా చేయడంతో అనవసరమైన చర్చలకు, వివాదాలకు దారితీస్తుంది. దీనికి బదులుగా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయానికి రావాలి. ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే, మరుసటి ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలి. ఈ పద్ధతి పాటించడంతో ఎలాంటి సమస్యలు ఉండవు” అని మురళీమోహన్ సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘తెలంగాణలో ఈ సినిమాకు, ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుంది. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయి. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్లు చూస్తున్నారు’’ అని వివరించారు. తెలుగు సినిమా పరిశ్రమ, ప్రేక్షకుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.