- సొంత మైదానంలో ఆర్ఆర్ చిత్తు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స జైత్ర యాత్ర కొనసాగుతొంది. ఈరోజు జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసిన ముంబై జట్టు… 100 పరుగుల తేడాతో భారీ విజయం నమొదు చేసింది. దీంతో దాదాపు 13 ఏళ్ల తరువాత ముంబై జట్టు జైపూర్ లో జండా పాతింది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
ముంబై ఇండియన్స్ ప్యూర్ డామినేషన్..
ఇదిలా ఉండగా, నేటి మ్యాచ్లో ముంబై ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చింది. పూర్తి ఆధిపత్యంతో ముందుగా బ్యాటర్లు విధ్యంసం సృష్టించగా.. ఆ తరువాత బౌలర్లు విజృంభించారు. దాంతో 218 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 117 పరుగులకే కుప్పకూలిం ఘోర పరాజం పాలైంది.
రాజస్థాన్ తరుఫున జాఫ్రా ఆర్చర్ (30) ఒక్కడే అత్యధిక పరుగులు సాధించాడు. కాగా, పరుగుల ఛేదనలో రాజస్థాన్ మరోసారి తడబడింది. పవర్ ప్లే ముగిసేలోపే రాజస్థాన్ 4.5 ఓవర్లలో 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్లో గుజరాత్పై సెంచరీతో ఆకట్టుకున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు.
ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13), నితిష్ రాణా (9), కెప్టెన్ రియాన్ పరాగ్ (16), దృవ్ జురేల్ (11), షిమ్రాన్ హెట్మెయర్ (0), శుభం దుబే (15), మహేశ్ తీక్షణ (2), కుమార్ కార్తికేయ (2) ఇలా అందరూ చేతులెత్తేశారు. ఏఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకోకుండా స్వల్ప పరుగులకే వికెట్లు పారేసుకున్నారు.
ఇక ముంబై బౌలర్లలో కరణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో మెరిశారు. జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఓపెనర్ల విధ్వంసం..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు.. నిర్ణీత ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (61 ; 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు), రోహిత్ శర్మ (53 ; 36 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (48 ; 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (48 ; 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సులు) మెరుపు బ్యాటింగ్ తో మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. దాంతో ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డుపై భారీ పరుగులు నమోదయ్యాయి.
టేబుల్ టాపర్లుగా..
రాజస్థాన్ రాయల్స్ పై ఈ విజయంతో వరుసగా ఆరు మ్యాచ్ లు గెలిచిన ముంబై తమ ఖాతాలో 14 పాయింట్లతో (+1.274) టేబుల్ టాపర్లుగా అవతరించింది. మరోవైపు రాజస్థాన్ జట్టు 6 పాయింట్లతో (-0.780) 8వ స్థానంలో ఉంది.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 14 పాయింట్లతో (+0.521) రెండో స్థానంలో ఉండగా.. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో (+0.199), గుజరాత్ టైటాన్స్ 12 పాయింట్లతో (+0.748) ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.