Modi | మౌనమే ఆయుధం .. అనివార్య స్థితి … ఎవరి పక్షం తగదు

ఇక్కడ మిత్రుడి మిత్రుడే శత్రువే
దేశ ప్రయోజనాలే ఇప్పుడు కీలకం
గ‌తంలో గల్ఫ్ యుద్ధం ఒక‌ అనుభవం
ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య ముదిరిన వివాదాలు
జోక్యం చేసుకుంటున్న అమెరికా, ర‌ష్యా
మౌనంగా ఉండ‌ట‌మే భారత్ నయా వ్యూహం

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :

మధ్య ప్రాచ్యంలో రగిలిన మారణ హోమంతో ప్రపంచం దద్దరిల్లిపోతోంది. ఇరుగు పొరుగు దేశాల ఘర్షణకు మద్దతు, వ్యతిరేకతలతో ప్రపంచ దేశాలు భిన్న ధ్రువాలుగా అవతరిస్తుంటే.. వర్ధమాన దేశాలు ప్రశాంతతను కోరుకొంటున్నాయి. ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలు పొరుగు దేశాల మధ్య ఆజ్యం పోస్తున్న తరుణంలో.. ప్రశాంత జీవనానికి కట్టుబడిన భార‌త‌దేశం ఆలోచన, వ్యూహం, విధి విధానాలపై యావత్ దేశ ప్ర‌జ‌లు తర్జన భర్జన ప‌డుతున్నారు. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనివార్యమవుతున్న స్థితిలో.. మనం ఏ పక్షం? ఆ గట్టున ఉంటావా? నాగన్న.. ఈ గట్టున ఉంటావా? అని దేశాధినేత నరేంద్ర మోదీని ప్రశ్నించేవారున్నారు. కానీ, దేశ ప్రయోజనార్ధం భారత్ ఏ పక్షం ఉంటుంది? యుద్ధమా? శాంతా? ఇందుకు ఏ నిర్ణయాలు తీసుకుంటుందనేది అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది..

శత్రువు శత్రువుల వ్యూహాలు..

గత వారం ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు, ఎవరో ఒకరి పక్షాన నిలబడాలి. ఈ ఘర్షణ ఎటు దారి తీస్తుంది? ఎదోక దేశం పక్షం మద్దతు పలకటం భారత్‌కు అంత సులువైన విషయం కాదు. కానీ, దాదాపు నెలరోజుల కిందట, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేసినప్పుడు భారత్‌కు ఇజ్రాయెల్ బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. అసలు భారత్ దాడిని ఇజ్రాయెల్ ఎందుకు సమర్థించింది. ఎందుకంటే, ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా పాకిస్తాన్ ఇంకా అంగీకరించలేదు. మరోవైపు సరిహద్దు దేశం ఇరాన్‌తో పాకిస్థాన్‌కు అనుబంధం ఉంది. ఈ క్ర‌మంలోనే ఇరాన్‌పై వ్యతిరేకతతో భారత్ చర్యలకు ఇజ్రాయెల్ మద్దతు తెలిపింది. కానీ, పాకిస్థాన్‌కు అమెరికాతో అనుబంధం తీరనిది. ఈ స్థితిలో ఇరాన్‌తోనూ పాకిస్థాన్‌ది వీడలేని బంధం. ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికాతో అనుబంధాన్ని తెంచుకోలేని స్థితికి చేరింది. అమెరికా ఎవరికి సఫోర్ట్ చేస్తే.. అదే మాట మాట్లాడాలి. వాస్త‌వానికి భార‌త్ ఇరాన్‌ను వ్యతిరేకించాలి. కానీ.. ఇరాన్‌తోనూ భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. అంటే అమెరికాకు వ్యతిరేక దేశం, పాకిస్థాన్ మిత్రదేశం ఇరాన్.. భారత్‌కూ మిత్రదేశమే. ఇరాన్‌కు బద్ధ శత్రువు ఇజ్రాయెల్ కూడా ఇండియాకు మిత్రపక్షమే. ఇలాంటి అనుబంధాల నేపథ్యంలో భారత్ త‌క్ష‌ణ‌మే ఏ నిర్ణయం తీసుకోలేక‌పోతుంద‌నేది వాస్త‌వం. అందుకే మధ్యేయ మార్గాన్ని మహాయుధంగా భారత్ భావిస్తోంది.

ఆచీ తూచీ అడుగులు..

ఇజ్రాయెల్ విషయంలో భార‌త్ మరింత ఉదారంగా ఉంది. గత వారం రోజుల్లో జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఇజ్రాయెల్ వైపు భారతదేశం ఎక్కువగా మొగ్గు చూపినట్టు అర్థమవుతోంది. ఉదాహరణకు, గాజాలో తక్షణ కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 12న ఓటింగ్ నిర్వహించింది. 149 దేశాలు కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు వేశాయి. 12 దేశాలు కాల్పుల విరమణకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 19 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ 19 దేశాలలో భారత్ కూడా ఒకటి. ఈ 19 దేశాలను పరిశీలిస్తే, భారత్ మినహా పనామా, దక్షిణ సూడాన్, టోగో, మలావి వంటి ఇతర దేశాలకు ప్రపంచ రాజకీయాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేదు. కాల్పుల విరమణకు వ్యతిరేకంగా ఓటు వేసిన 12 దేశాల్లో అమెరికా కూడా ఉంది. కానీ ఫిజి, పపువా న్యూ గినియా, టోంగా వంటి మిగిలిన 11 దేశాలు అంతర్జాతీయ వేదికలపై పెద్దగా ప్రభావం చూపలేవు. అయితే, కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు వేసిన 149 దేశాలలో, దాదాపు అన్ని ముఖ్యమైన దేశాలు ఉన్నాయి. చైనా, జపాన్ నుంచి యూరప్ వరకు మొత్తం ఇందులో ఉన్నాయి. కానీ, భారత్ ఈ ముఖ్యమైన దేశాల్లో లేదు. అయితే, భారత్ సభ్యుడిగా ఉన్న ప్రపంచ సంస్థల్లో ఇజ్రాయెల్ విషయానికి వస్తే, భారత్ భిన్నంగా వ్యవహరిస్తోంది.

ఇజ్రాయోల్ వైపే మొగ్గు

షాంఘై సహకార సంస్థ (షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్) ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ జూన్ 14న ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ కూడా ఎస్‌సీఓలో సభ్యదేశంగా ఉంది. కానీ, ఎస్‌సీఓ ప్రకటనలో భారత్ భాగం కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అదే రోజు ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, భారత్‌కు బ్రిక్స్‌లో సభ్యత్వం ఉంది. దాదాపు అన్ని బ్రిక్స్ దేశాలు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించాయి. కానీ, భారత్ తటస్థంగా ఉంది. యూఎన్‌జీఏలో కూడా, దాదాపు అన్ని బ్రిక్స్ సభ్యదేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు వేశాయి. ఆ ఓటింగ్‌కు దూరంగా ఉన్న బ్రిక్స్ సభ్య దేశాలు భారత్, ఇథియోపియా. క్వాడ్‌ను చైనా వ్యతిరేక సమూహంగా చూస్తారు. ఇందులో జపాన్, భారత్, ఆస్ట్రేలియా, అమెరికా ఉన్నాయి. ఇందులో కూడా, జపాన్, ఆస్ట్రేలియా యూఎన్‌జీఏలో కాల్పుల విరమణకు మద్దతుగా ఓటు వేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో, భారత్ వైఖరిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారత్ మౌనానికి అర్థమేంటి?

సంక్షోభ సమయాల్లో మౌనం నుంచి లాభాలే కాదు అనేక అర్థాలు తీసుకోవచ్చు. మోదీ నాయకత్వంలో దౌత్యపరంగా భారత్‌పై విశ్వాసం పెరిగింది. ఈ నిర్ణ‌యం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత్ సంప్రదాయికంగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలు, ఇరాన్ మధ్య సమతుల్య వైఖరిని కొనసాగిస్తోంది. ఇది అందరితోనూ సమానంగా అని కాదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చల తర్వాత ప్రధాని మోదీ చెప్పిన దానిని బట్టి చూస్తే.. ఇజ్రాయెల్‌కు స్పష్టమైన మద్దతు ఇవ్వలేదు. అలా అని ఇజ్రాయెల్ దాడిని ఖండించనూలేదు. రష్యాతో భారత్‌కు చారిత్రక స్నేహం ఉంది. కానీ, అది ర‌ష్యా ఇజ్రాయెల్‌ను బహిరంగంగా విమర్శిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని రష్యా విదేశాంగ మంత్రి ఖండించారు. ఉద్రిక్తతలను త‌గ్గించేందుకు సాయం అందిస్తామ‌ని చెప్పారు.

ఇరాన్‌కు బ్రిక్స్, ఎస్‌సీఓలో సభ్యత్వం..

ఇరాన్‌తో స్నేహాన్ని తార్కిక ముగింపునకు తీసుకెళ్లడానికి భారత్ చాలా కాలంగా సంకోచిస్తోంది. 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు, ప్రపంచం కొత్త మలుపు తీసుకుంది. అమెరికాతో భారత్ సంబంధాలు బలోపేతం కావడం కూడా భారత్‌ను ఇరాన్‌కు దగ్గర కాకుండా నిరోధించాయి. 1990లో భారతదేశ ఆర్థిక సంక్షోభానికి అంతర్జాతీయంగా కొన్ని కారణాలు ఉన్నాయి. 1990లో ప్రారంభమైన గల్ఫ్ యుద్ధం భారత్‌పై ప్రత్యక్షంగా ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. ఆ ప్రభావం భారత్‌పై పడింది. చమురు ధరల పెరుగుదల, దిగుమతుల పరిమాణం పెరగడంతో 1990-91లో పెట్రోలియం దిగుమతి బిల్లు 200 కోట్ల డాలర్ల నుంచి 570 కోట్ల డాలర్లకు పెరిగింది. ఈ స్థితిలో మిత్రబేధం, మిత్ర లాభం పరిణామాలు బేరీజు వేసుకునే భారత్ మౌన ముని దీక్ష పట్టిందని విశ్లేషకుల అంచనా.

Leave a Reply