Miss World | అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ ఫైనల్స్..

హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఈరోజు (శనివారం) అంగరంగ వైభవంగా మిస్ వరల్డ్ ఫైనల్స్ ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుండి వచ్చిన అందాల భామలు ఈ పోటీలో పాల్గొంటున్నారు. విద్యుత్ దీపాల వెలుగులో ర్యాంప్‌పై చేస్తున్న కాంటెస్టెంట్లు మెరిశారు.

దాదాపు 20 రోజుల పాటు వివిధ ఛాలెంజ్‌లు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న పోటీదారులు, ఇప్పుడు ఫైనల్‌కు చేరుకున్నారు. ఈక్రమంలో తెలంగాణలోని పలు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు. “తెలంగాణ జరూర్ ఆనా” అనే సందేశాన్ని ప్రపంచానికి చాటారు.

ఈ కార్యక్రమానికి మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ హోస్ట్ సచిన్ కుంభర్ నిర్వహకులుగా ఉన్నారు. బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఈ రాత్రి స్టేజ్‌పై లైవ్ షోలతో అలరించనున్నారు. నగరంలోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ అందాల పోటీలు బాలీవుడ్ తారల ప్రత్యేక ప్రదర్శనలతో మరింత శోభను సంతరించుకున్నాయి.

ఈ ప్రతిష్టాత్మక కిరీటం కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన సౌందర్యరాశులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో భాగంగా ఇప్పటికే పలు దశల్లో తమ ప్రతిభను చాటుకున్న అందగత్తెల నుంచి 16 మంది క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.

వీరి నుంచి చివరి రౌండ్‌లో నలుగురిని ఎంపిక చేయనున్నారు. అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ నలుగురు ఫైనలిస్టులుగా నిలుస్తారు. ఈ నలుగురికి అడిగే చివరి ప్రశ్న, దానికి వారు ఇచ్చే సమాధానం ఆధారంగా న్యాయనిర్ణేతలు మిస్ వరల్డ్ 2025 విజేతను ప్రకటించనున్నారు.

ఈ ఫైనల్ పోటీలకు న్యాయనిర్ణేతల బృందంలో ప్రముఖ నటుడు సోనూ సూద్, వ్యాపారవేత్త సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లండ్ కెరీనా ఉన్నారు. మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ జూలియా మోర్లీ ఈ న్యాయనిర్ణేతల ప్యానెల్‌కు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా, నటి నమ్రత హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

ఈ గ్రాండ్ ఫినాలే సోనీ లివ్‌ ద్వారా లైవ్ స్ట్రీమ్ అవుతుండగా, ఇతర దేశాల్లో టీవీల్లో మరియు www.watchmissworld.com లో కూడా వీక్షించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *