Miss World Finals – మిస్ వరల్డ్ ఫైనల్స్ లో మిస్ ఇండియా నందిని గుప్తా

హైదరాబాద్: మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీలు మే 31న(శనివారం) హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఉన్న నాలుగో హాల్‌లో జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్‌ మొదలైంది.

ప్రస్తుతం ఫైనల్ బరిలో నలుగురు నిలిచారు. వీరిలో ఏషియా, ఓషీనియా గ్రూప్ నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా, యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హాట్, ఆఫ్రికా నుంచి నమీబియాకు చెందిన సెల్మా కామనియా, అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి మార్టినిక్‌కు చెందిన ఆరెలీ జోచిమ్‌లు ఉన్నారు. ఫైనల్స్‌లో పోటీపడేది ఈ నలుగురే. వీరిలో ఒకరు ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకుంటారు. మిగిలిన ముగ్గురిని ప్రతిభను బట్టి రన్నరప్‌లుగా ప్రకటిస్తారు.

భద్రతా చర్యలు

మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పోలీసు విభాగం ట్రాఫిక్‌ విభాగం, పర్యాటక శాఖ, మిస్ వరల్డ్ నిర్వాహకులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ పోటీ జరిగే హాల్‌ సామర్థ్యం 3,500 మంది మాత్రమే. పూర్తిసంఖ్యలో అతిథులు వచ్చే అవకాశం ఉంది. ఆమేరకు ఏర్పాట్లు, భద్రతా చర్యలను చేపట్టనున్నారు. ఫైనల్‌ వేడుకలు మే 31న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి.

మిస్ వరల్డ్’ రేసులో ఇండియా, వెనెజ్వెలాలదే అగ్రపీఠం

‘మిస్ వరల్డ్’ కిరీటం దక్కించుకోవడంలో ఇప్పటివరకు ఇండియా, వెనెజ్వెలాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇప్పటివరకు భారత్ నుంచి ఆరుగురు ఈ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. రీటా ఫారియా (1966), ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హైడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంకా చోప్రా (2000), మానుషి చిల్లార్ (2017) మిస్ వరల్డ్‌ అయ్యారు. వెనెజ్వెలా కూడా ఆరుసార్లు విజయంతో ఇండియా సరసన నిలిచింది. తర్వాతి స్థానాల్లో యూకే (5), యూఎస్ఏ (3), దక్షిణాఫ్రికా (3) ఉన్నాయి.

Leave a Reply