- నారా లోకేష్ కు వినతుల వెల్లువ
- ఉండవల్లి ప్రజా దర్భార్ కు బాధితులు క్యూ
- సమస్యలు విన్నవించేందుకు తరలివచ్చిన సామాన్య ప్రజానీకం
- ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా లోకేష్ పలకరింత
- త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ
ఉండవల్లి : రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకానికి మొదటి రోజు నుంచి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ ఉదయం ఉండవల్లి నివాసంలో 61వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. తమ సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున సామాన్యులు ఉండవల్లి నివాసానికి తరలివచ్చారు. పెన్షన్, భూ సంబంధిత సమస్యలు, ఉద్యోగ, ఉపాధి, వైద్య, ఆర్థికసాయం కోసం పెద్దఎత్తున ప్రజాదర్బార్ కు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా విన్నపాలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పలు అర్జీలపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఇళ్ల స్థలాల పేరుతో భూమి కబ్జా..
వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో తమ 0.34 ఎకరాల భూమిని అధికారులు అన్యాక్రాంతం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామానికి చెందిన పడాల రాములు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. తమకున్న ఏకైనా ఆధారాన్ని రక్షించాలని కోరారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
కారుణ్య కోటాలో ఉద్యోగం ఇప్పించండి..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీలో పనిచేస్తుండగా తన భర్త విద్యుత్ షాక్ కు గురై 2020లో మరణించాడని, కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని చిలకపాలెం గ్రామానికి చెందిన డి.రేవతి మంత్రి నారా లోకేష్ ను కలిలి విన్నవించారు. యూనివర్సిటీ యాజామాన్యానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, తన ఇద్దరు పిల్లల చదువుల కోసం తనకు ఏదైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయాలు నిరాదరణకు గురయ్యాయని, పుస్తకాల కొనుగోళ్లు నిలిచిపోయాయని, నిర్వహణ సక్రమంగా లేదని, విద్యాసంస్థల్లోనూ గ్రంథాలయాల నిర్వహణ నామమాత్రంగా ఉందని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రంథాలయాల అభివృద్ధికి, పునర్వికాసానికి అవసరమైన సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
డిగ్రీ కళాశాల మంజూరు చేయండి..
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని సమైక్య యూత్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మూడు దశాబ్దాల నుంచి కొయ్యలగూడెంలో డిగ్రీ కాలేజీ లేక పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. కళాశాల ఏర్పాటునకు ఇప్పటికే శాఖపరమైన పనులు పూర్తయ్యాయని, త్వరితగతిన పరిపాలన అనుమతులు మంజూరు చేసి మూడు దశాబ్దాల కలను నెరవేర్చాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
బీఎస్సీ నర్సింగ్ చేశా
బీఎస్సీ నర్సింగ్ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఒంగోలు పట్టణం మామిడిపాలెంకు చెందిన ఏ.మౌనిక మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
పుట్టుకతో దివ్యాంగుడు అయిన తన కుమారుడికి దివ్యాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని విజయవాడ పోరంకికి చెందిన ఐ.వరప్రసాద్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం, కవులూరులో తమకు నివేశన స్థలాన్ని మంజూరు చేసి ఇంటి పట్టా కూడా ఇచ్చారని, ఈ రోజు వరకు సదరు స్థలాన్ని చూపించలేదని విజయవాడ జక్కంపూడికి చెందిన అన్నమరాజు ముత్యాలు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమకు మంజూరు చేసిన స్థలం జాడచూపించి, ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
2017-18 అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ క్వాలిఫైడ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
కడప, రేణిగుంట మధ్య జాతీయ రహదారి -716 విస్తరణలో భాగంగా తన ఇంటిని అధికారులు సేకరించారని, అయితే ఇంటి నిర్మాణానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించి.. ఇంటి స్థలానికి నష్టపరిహారం ఇవ్వకుండా వైసీపీ హయాంలోని భూసేకరణ అధికారులు వేధిస్తున్నారని తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడికి చెందిన కె.సుబ్రహ్మణ్యం మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి ఇంటి నిర్మాణం, స్థలానికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.