ఖమ్మంలో సామూహిక వందేమాతరం గీతాలాపన

ఖమ్మంలో సామూహిక వందేమాతరం గీతాలాపన
పాల్గొన్న ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డా. పి.శ్రీజ
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : శుక్రవారం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డా. పి. శ్రీజ (P. Sreeja), అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్పూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటీతో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.

వందేమాతరం (Vande Mataram) గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో నిండి, భారతదేశం ఒకటే అని గర్వంగా చెబుతుందని అన్నారు. ఈ గీతం మన దేశ ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ ఈ భావనను మనసులో నిలుపుకోవాలని తెలిపారు. వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్నట్లు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
