హైదరాబాద్ : మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జల్ పల్లిలోని మోహన్ బాబు ఫార్మ్ హౌస్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫార్మ్ హౌస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బయటే బైఠాయించారు. ఈక్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తన కారు పోయిందని మంగళవారం మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్ జయపుర వెళ్లడాన్ని అవకాశంగా తీసుకొని ఆయన సోదరుడు విష్ణు ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. ”ఈనెల 1న మా పాప పుట్టినరోజు సందర్భంగా జయపుర వెళ్లగా నా సోదరుడు విష్ణు 150మందితో జల్పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామాగ్రి ధ్వంసం చేశారు. మా కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారు. నా కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారు. జల్పల్లిలో నా భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా, అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్కు పంపించారు” అని మనోజ్ మీడియాతో చెప్పారు.