హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్ఆర్ఎస్) గడువు పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ ఫీజుపై ఇస్తున్న 25శాతం రాయితీని మరో నెల రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు
మార్చి నెల నుంచి అమల్లో ఉన్న ఎల్ఆర్ఎస్ గడువును ఇప్పటికే ఒకసారి పెంచారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ గడువు పూర్తికావడంతో.. మళ్లీ మూడురోజులు అదనంగా పెంచిన ప్రభుత్వం.. ప్రస్తుతం నెల రోజులు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)లో 20లక్షల మంది ఫీజు చెల్లించాల్సిన దరఖాస్తుదారులు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 6లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించేందుకు ముందుకు రావడంతో పురపాలక శాఖ అధికారులు గడువును పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి సూచనలు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు రాయితీ గడువు పెంచుతూ నిర్ణయించింది.
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారిలో 40శాతం మందికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ రాయితీపై ఇప్పటి వరకు ప్రభుత్వానికి సుమారు రూ.1900 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు రాయితీ గడువు పెంపుతో ప్రభుత్వానికి మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉంది.