కటక్ – ఒడిశాలోని నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. సుందర్ ఘడ్ జిల్లాలో 30 నుంచి 40 మంది నక్సల్స్ బృందం 1.5 టన్నుల పేలుడు పదార్ధాల ఉన్న ట్రక్కును దోచుకుంది. ఈ ఘటన తర్వాత ఒడిశా, జార్ఖండ్ పోలీసు దళాలు అప్రమత్తమయ్యాయి.
వివరాలలోకి వెళితే బడాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇట్మా సమీపంలోని మందుగుండు సామగ్రి గిడ్డంగి నుండి లంగల్కట రాతి క్వారీకి పేలుడు పదార్థాలను ఓ ట్రక్కు రవాణా చేస్తోంది. దీనిని గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కె బాలంగ్ పోలీస్ పరిధిలోని లంగల్కట ప్రాంతం సమీపంలో నక్సల్స్ అడ్డగించారు. ఆయుధాలతో ఉన్న వ్యక్తులు వాహనాన్ని ఆపి.. డ్రైవర్ను బందీగా చేసుకున్నారు తరువాత ట్రక్కును సరందా దట్టమైన అడవుల వైపు బలవంతంగా మళ్లించారు. అడవుల్లోకి వెళ్ళాక నక్సల్స్ డ్రైవర్ ను ఏమీ చేయకుండా విడిచిపెట్టారని పోలీసులు తెలిపారు.
దీని తరువాత స్థానిక పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ట్రక్కును కనుగోనడానికి పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఈ దొంగతనం జరగడంతో తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది.