విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న వైకాపా ఎంపీ మిథున్రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
మిథున్రెడ్డిని శనివారం అరెస్టు చేసిన సిట్ అధికారులు.. ఇవాళ విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచిన సంగతి తెలిసిందే.అంతకు ముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధరించడంతో అధికారులు ఆయన్ను ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పర్చారు.
మిథున్రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420, 120(బీ), రెడ్విత్ 34, 37, ప్రివెన్షన్ ఆప్ కరెప్షన్ యాక్టు 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.
సిట్ తరఫున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరఫు న్యాయవాది కోరారు. మిథున్రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని, రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
మిథున్రెడ్డి ప్యానెల్ స్పీకర్గా పనిచేశారని, ఆయన అరెస్టుపై స్పీకర్కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.