వెలగపూడి, ఆంధ్రప్రభ : వనమహోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఇదే రోజు నాటికి కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు. అడవుల్లో కార్చిచ్చు ఆపే ప్రయత్నాలు చేయాలని, అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అంకారావు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశంసించారు. గతంలో ఇంటి అడ్రెస్ కావాలంటే అదిగో.. ఆ మర్రిచెట్టు పక్కవీధిలో అనేవారు.. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని ఆకాక్షించారు.
సుసంపన్నమైన ప్రకృతిని అందిద్దాం..
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.. భవిష్యత్ తరాలకి అందించాల్సిన గొప్ప బహుమతి శుభ్రమైన పర్యావరణమేనని గుర్తు చేశారు. దీనికోసం అందరం చెట్లు నాటి పచ్చదనాన్ని పెంచుదామంటూ పిలుపునిచ్చారు. నీటి కాలుష్యాన్ని నివారిద్దాం.. నీటి వనరులను కాపాడుకుందాం.. వన్యప్రాణులను రక్షించుకుందాం.. జీవవైవిధ్యాన్ని పరిరక్షిద్దాం.. పర్యావరణాన్ని ప్రేమిద్దాం.. భవిష్యత్ తరాల భద్రతకై కృషి చేద్దామని అన్నారు. సుసంపన్నమైన ప్రకృతిని మన పిల్లలకు బహుమతిగా ఇద్దాం.. ఇది మన భూమి.. ఇది మన బాధ్యత అని పేర్కొన్నారు.