- వార్విక్లో PDSL సెంటర్ ప్రారంభించిన కేటీఆర్
- యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం
- విశ్వవిద్యాలయాలు-పరిశ్రమల మధ్య అనుసంధానం అవసరం
- హైదరాబాద్ను ఆటోమోటివ్ హబ్గా అభివృద్ధి
- ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ
- పూణే, చెన్నైతో పోటీగా ఆటోమోటివ్ రంగంలో హైదరాబాద్ ప్రగతి
ఇంగ్లాండ్లోని వార్విక్ విశ్వవిద్యాలయంలో ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (PDSL) నాలెడ్జ్ సెంటర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా, తెలంగాణ అభివృద్ధికి తన అంకితభావాన్ని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించడం, పరిశోధన – అభివృద్ధి (R&D) రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నాలెడ్జ్ సెంటర్ను స్థాపించినట్లు ఆయన తెలిపారు. “ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్” అనే నినాదంతో, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కేటాఆర్ తెలంగాణ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తన ప్రధాన లక్ష్యం రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమేనని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
మెక్లారెన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్, ఆస్టన్ మార్టిన్ వంటి అంతర్జాతీయ ఆటోమోటివ్ దిగ్గజాలకు PDSL కంపెనీ పరిశోధన-అభివృద్ధి సేవలను అందిస్తుందని, వార్విక్ విశ్వవిద్యాలయంలో ఈ కేంద్రం ఏర్పాటు తెలంగాణ ప్రతిభను ప్రదర్శిస్తోందని కేటీఆర్ అన్నారు.
పూణే, చెన్నై వంటి నగరాలతో సమానంగా హైదరాబాద్ను ఆటోమోటివ్ హబ్గా అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు కీలక పాత్ర పోషించాయని కేటీఆర్ పేర్కోన్నారు. ఫార్ములా-ఈ రేసింగ్ ఛాంపియన్షిప్ను నిర్వహించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉన్నందున, రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించాలని కేటీఆర్ పిడిఎస్ఎల్ను కోరారు. యుకేలోని విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య సమన్వయం అభినందనీయమని, తెలంగాణలోనూ ఇన్నొవేషన్ను ప్రోత్సహించడానికి ఇలాంటి మోడల్స్ అవసరమని ఆయన అన్నారు.
గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రపంచ కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ఎల్ డైరెక్టర్ కృష్ణపప్పల మాట్లాడుతూ.. కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశంసించారు… ఆయన విధానాల వల్లే ఐటి, ఆవిష్కరణ రంగాలలో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని అన్నారు. తెలంగాణను పరిశ్రమలకు గమ్యస్థానంగా మార్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం నాలెడ్జ్ సెంటర్ను పరిశీలించిన కేటీఆర్ ఉద్యోగులతో మాట్లాడారు. తయారీ రంగంలోనే కాకుండా ఆటోమోటివ్ రంగంలో కూడా తెలంగాణ పరిశోధనాభివృద్ధిలో ముందంజలో ఉండాలని, యువతకు నైపుణ్యాలను నేర్పించడం అవసరమని అన్నారు.