ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది (Krishna river) ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో రావడంతో… జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఈరోజు (శనివారం) సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి ప్రవేశించే వరద నీటి ప్రవాహం (InFlow) 1,15,000 క్యూసెక్కులు గా నమోదైంది. వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమై 8 గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం (Srisailam) వైపు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, జూరాల స్పిల్వే ద్వారా ప్రస్తుతం 57,136 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా.. పవర్ హౌస్ ద్వారా 33,419 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. కోయిలసాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్కులు, ఆర్ఎమ్సి (RMC) ద్వారా 700 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కాల్వ ద్వారా 50 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. అన్ని డిమాండ్లు కలిపి 91,616 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు నుంచి విడుదల అవుతోంది.
జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 318.516 మీటర్లు (9.657 టీఎంసీలు సామర్థ్యం) కాగా, ప్రస్తుతం నీటిమట్టం 318.290 మీటర్లు (1,044.259 అడుగులు) వద్ద ఉంది. ప్రాజెక్టులో స్థూల నిల్వ 9.193 టీఎంసీలు, లైవ్ స్టోరేజ్ 5.486 టీఎంసీలు గా ఉంది.
వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పర్యవేక్షణను మరింత కఠినంగా నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.