మంగళగిరి – జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుంటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.. ఇక, మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు పవన్.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో పహల్గామ్ అమరులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జనసేన.. ఈ కార్యక్రమంలో ముందుగా మధుసూధన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు..
కాగా, బెంగళూరులో స్థిరపడిన నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్.. ఈనెల 22న పహల్గామ్లో తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లగా.. ఉగ్రవాదులు కాల్చి చంపారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్కు చెందిన మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, కూతురు మేధ, కుమారుడు దత్తు ఉన్నారు. మధుసూదన్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్న విషయం విదితమే.