శ్రీనగర్ -జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్గామ్లో పర్యాటకులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పులలో ఇప్పటి వరకు అయిదుగురు మరణించారు.. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి.
సమ్మర్ సీజన్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ పేర్కొనే పహల్గాంలోని బైసరీన్ వ్యాలీ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. అయితే, ఈ బైసరీన్ వ్యాలీని సందర్శించాలంటే కాలినడకన లేదంటే గుర్రాలమీద చేరాల్సి ఉంటుంది. దీన్నే అదునుగా భావించిన ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ముష్కరుల కాల్పులపై అప్రమత్తమైన భారత భద్రతాబలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. కాగా ,కాల్పుల ఘటనకు తామే బాధ్యులమంటూ పాక్ కు చెందిన లష్కరే తోయిబా అనుబంధంగా పనిచేస్తున్న టిఆర్ఎఫ్ ప్రకటన విడుదల చేసింది.
సౌదీ నుంచి అమిత్ షాకు మోడీ ఫోన్
ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే సౌదీ పర్యటనలో ఉన్నమోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు.. కాల్పుల ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఉగ్ర వాదుల క్యాంపులను గుర్తించి వాటిని ధ్వంస చేయాలని ఆదేశించారు.. అలాగే కాల్పులు జరిపిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు.. అలాగే ఘటన స్థలానికి వెళ్లవలసిందిగా హోం మంత్రిని ఆదేశించారు. ఇక ఈ ఘటనను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, గవర్నర్ మనోజ్ సిన్హా లు ఖండించారు.