తాడేపల్లి: పశ్చిమ గోదావరి జిల్లా పలకొల్లు పట్టణానికి చెందిన 23 ఏళ్ల యువతి జ్ఞానవి డంగేటి, భారతీయ మహిళల ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రతినిధ్యం వహిస్తూ అరుదైన ఘనతను సాధించింది. ఆమెను అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI) నిర్వహించే 2029 అంతరిక్ష యాత్రకు వ్యోమగామిగా అధికారికంగా ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది.
అంతరిక్ష ప్రయాణానికి మూడేళ్ల కఠిన శిక్షణ
TSI చేపట్టే ఈ అంతరిక్ష మిషన్ 2029లో జరగనుండగా, ఆమె 2026 నుంచి మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందనుంది. ఈ శిక్షణలో స్పేస్షిప్ ఆపరేషన్స్, ఫ్లైట్ సిమ్యూలేషన్, మెడికల్-సైకాలజికల్ ట్రైనింగ్, లైఫ్ సపోర్ట్, సర్వైవల్ టెక్నిక్స్ వంటి అత్యంత క్లిష్టమైన అంశాలు ఉంటాయి.
ఈ మిషన్కు NASA మాజీ వ్యోమగామి కల్నల్ విలియమ్ మెక్ ఆర్థర్ జూనియర్ ప్రధాన వ్యోమగామిగా వ్యవహరించనున్నారు. మొత్తం ఐదు గంటల వ్యాసంలో నిర్వహించే ఈ ఆర్బిటల్ ఫ్లైట్, శాస్త్రీయ ప్రయోగాలు, మానవ అంతరిక్ష ప్రయాణ అభివృద్ధికి దోహదపడే విధంగా రూపొందించబడుతోంది.
విజయం వెనుక ప్రయాణం..
ప్రస్తుతం కువైట్లో నివసిస్తున్న పద్మశ్రీ–శ్రీనివాస్ దంపతుల కుమార్తె అయిన జ్ఞానవికి చిన్ననాటి నుంచే అంతరిక్షంపై గొప్ప ఆసక్తి. గోదావరి జిల్లాలో పాఠశాల విద్య అనంతరం, పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో బి.టెక్ పూర్తిచేసింది.
అనంతరం 2022లో పోలాండ్లోని అనలాగ్ ఆస్ట్రోనాట్ శిక్షణా కేంద్రం(AATC)లో శిక్షణ పొందిన తొలి తెలుగు యువతిగా గుర్తింపు పొందింది. అంతేకాక, NASA, ఇతర అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించే అంతర్జాతీయ ఖగోళ శోధన సహకారం (IASC)లోనూ పనిచేసింది.
పురస్కారాలు – ప్రేరణకు మార్గదర్శకం
జ్ఞానవి తన ప్రతిభతో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలను అందుకుంది. వాటిలో NASA Space Apps Challengeలో People’s Choice Award, ISRO నిర్వహించిన World Space Week Celebrationsలో Young Achiever Award, NASA International Air & Space Programmeను పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా అరుదైన గుర్తింపు ముఖ్యమైనవి. ఆమె విజయగాథ యువతకు ప్రేరణగా నిలుస్తోంది.